హరికృష్ణ తెదేపా వఖల్తా ఎందుకు పుచ్చుకొన్నట్లో

 

వైకాపా పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ చిచ్చుతో తెదేపాకు దూరమయి, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్ననందమూరి హరికృష్ణ నిన్నజరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ అవినీతి, అసమర్థ పార్టీలను త్రిప్పికొట్టి, తెలుగు దేశం పార్టీని గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇంత కాలం పార్టీ అంటే గిట్టనట్లు వ్యవహరించిన హరికృష్ణ, ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ తరపున మాట్లాడటం ఆశ్చర్యం కలిగించినా, ఆయన తెదేపా ద్వారా తన రాజకీయ జీవితం కొనసాగించేందుకే ఆసక్తి చూపుతున్నందునే ఆవిధంగా మాట్లాడినట్లు అర్ధం అవుతోంది.

 

రాజ్యసభ సభ్యుడయిన హరికృష్ణ మరో తొమ్మిది నెలలలో జరగనున్నఎన్నికలలో ఈ సారి గన్నవరం నియోజక వర్గం నుండి శాసనసభకు పోటీచేసే ఆలోచన ఉన్నట్లు ఇదివరకు ఒకసారి తెలిపారు. బహుశః దానిని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు మళ్ళీ పార్టీ తరపున మాట్లాడి ఉండవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో తెదేపా తప్పని సరి విజయం సాదించాలంటే కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి తెదేపా ఆయనకు టికెట్ కేటాయించగలదని భావించలేము. అదీగాక రాష్ట్ర విభజన తరువాత, దాదాపు 140 సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున టికెట్స్ కోసం పోటీ చాల అధికంగా ఉండబోతోంది. రానున్న ఎన్నికలలో గెలవడం తేదేపాకు ఎంత ముఖ్యమో వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు కూడా అంతే ముఖ్యం గనుక వారి మధ్య చాల తీవ్రమయిన పోటీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో హరికృష్ణ పార్టీ టికెట్ ఆశిస్తూ మళ్ళీ చంద్రబాబుకి దగ్గర కావాలని ప్రయత్నిస్తే మాత్రం ఆయనకు నిరాశ తప్పదు.