జీఎస్టీ..2000 To 2016

posted on: Aug 4, 2016 3:34PM

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంతో దేశ ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించినట్లైంది. ప్రస్తుత పన్నుల వ్యవస్థలో అనేకానేక సంక్లిష్టతలకు, సమస్యలకు పరిష్కారం చూపగల విశిష్ట సంస్కరణలకు ప్రతి రూపమే జీఎస్టీ. కానీ దీనికి ఏకాభిప్రాయం కుదరడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం అనేక షరతులు, సవరణలు ప్రతిపాదించి బిల్లు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి..ఎలాగైనా జీఎస్టీని పట్టాలపైకి ఎక్కించాలనుకున్న ఎన్‌డీఏ సవరణలకు తలొగ్గి పట్టుదలతో బిల్లును నెగ్గించుకొంది. ఈ క్రమంలో జీఎస్టీ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.

 

మనం ఏదైనా వస్తువు కొన్నపుడు బిల్లు గమనిస్తే ఎమ్మార్పీ ధరతో పాటు వ్యాట్, ఇతర పన్నుల కింద భారీగా పన్నులు కనిపిస్తాయి. ఎమ్మార్పీలోనే ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. పరోక్ష పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వసూలు చేయడంతో చిక్కులతో పాటు కొన్నిసార్లు ఒకే పన్ను రెండు సార్లు కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం వినియోగదారుడు వస్తువు ధరలో 25 నుంచి 30 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఈ భారాన్ని ముందుగానే గ్రహించిన కేంద్రం 1994లో వస్తు సేవల పన్నుపై ఆలోచన చేసింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి ప్రభుత్వం సాధికారిక కమిటిని నియమించటం ద్వారా జీఎస్‌‌టీపై చర్చను ఆరంభించింది. ఈ కమిటీకి అప్పటి పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అసీమ్ దాస్‌గుప్తా నాయకత్వం వహించారు. అనంతరం 2003లో పరోక్ష పన్నుల అమలుపై కేల్కర్ కమిటీని నియమించారు..తన నివేదికలో వస్తు సేవల పన్ను ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించింది ఈ కమిటీ.

 

2006లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్‌‌టీ ప్రతిపాదన చేశారు, 2007లో జీఎస్‌టీ అమలుకు కార్యాచరణను రూపొందించే బాధ్యత రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి అప్పగించారు. జీఎస్‌టీని 2011 ఏప్రిల్‌లో ప్రవేశపెడతామని 2010 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలిపారు. చెప్పిన విధంగానే జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లును 2011 లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీన్ని పార్లమెంట్ స్థాయి సంఘం పరిశీలనకు పంపారు. అయితే 15వ లోక్‌సభ మార్చిలో రద్దుకావటంతో బిల్లుకు కాలం చెల్లింది. 2012లో సాధికార కమిటీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జీఎస్‌టీ రూపకల్పన కమిటీ ఏర్పాటు చేశారు.

 

2013లో జీఎస్‌టీ రూపకల్పన కమిటీ తన నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా బిల్లులో కొన్ని సవరణలకు సాధికార కమిటీ సిపారసు చేసింది. 2014 డిసెంబర్ 19న రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, 2015 మే 6న సభ ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. ఆ కమిటీ అదే ఏడాది జూలై 22న నివేదికను సమర్పించింది. 2016 ఆగస్టు 3న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా..అదే రోజు సభ ఆమోదం పొందింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...