గవర్నర్ విందులో ఇద్దరు చంద్రులు

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో విడిది చేసిన సందర్భంగా ఆయన గౌరవార్ధం మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేసారు. దానికి ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులిరువురినీ సతీ సమేతంగా రావలసిందిగా ఆహ్వానించారు. వారితో బాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులను కూడా ఈ విందుకు ఆహ్వానించారు. మామూలు పరిస్థితుల్లో అయితే అందరూ ఈ విందులో హాజరయ్యేందుకు చాలా ఉత్సాహం చూపేవారు. కానీ ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8 వగైరాల కారణంగా ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో అందరూ ఒకరికొకరు ఎదురుపడటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఈ విందుకు ఎవరెవరు హాజరవుతారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. కానీ ముఖ్యమంత్రులిరువురూ తప్పకుండా హాజరు కావచ్చును. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గవర్నర్ వారిరువురి మధ్య రాజీ ప్రయత్నమేమయినా చేస్తారేమో కూడా?