దేశానికి ఒక జ్వాల లేదా ఒక సైనా ఉంటే చాలదు: గుత్తా
posted on Nov 10, 2012 9:29AM
షట్లర్ గుత్తా జ్వాల కోచ్ గోపీచంద్ పై ఘాటైన విమర్శలు చేసింది. జాతీయ కోచ్గా ఉన్న గోపీచంద్ సొంత ప్రైవేట్ అకాడమీని నిర్వహించడం సరికాదని జ్వాల తప్పుపట్టింది. సొంత ప్రైవేట్ అకాడమీని నిర్వహిస్తున్న వ్యక్తి జాతీయ కోచ్గా ఉండడం నైతికంగా సరికాదు. అతను సెలెక్షన్ ప్యానెల్లో ఉంటే క్రీడాకారులందరికీ న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించింది. ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పించాలి. దేశానికి ఒక జ్వాల లేదా సైనా ఉంటే చాలదు. ఎంతోమంది క్రీడాకారులు ఎదగాలి. నేను దూరమైతే అశ్విని, దిజుకు సరైన డబుల్స్ భాగస్వామి లేరు' అని జ్వాల చెప్పింది.
బ్యాడ్మింటన్ ప్రస్తుతం ధనికుల క్రీడగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించింది. బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడింది. కోచింగ్ క్యాంప్నకు తనను అనుమతించకుండా కోచ్ గోపీ వేధిస్తున్నాడంటూ కోర్టును ఆశ్రయించిన మరో క్రీడాకారిణి ప్రజక్తా సావంత్కు జ్వాల మద్దతు తెలిపింది. ప్రజక్తాను క్యాంప్లో చేర్చుకోవాల్సిందిగా బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.