మాజీ మంత్రి బొజ్జల మృతి.. బాబు దిగ్బ్రాంతి
posted on: May 6, 2022 4:53PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఆయన అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మాజీ సీఎం చంద్రబాబు కెబినెట్లో ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్ దాడిలో బొజ్జల కూడా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే బొజ్జల మృతిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్ కట్ చేసి... జన్మదిన వేడుకలు జరిపించారు. ఈ సందర్బంగా బొజ్జలతో కొద్దిసేపు చంద్రబాబు మాట్లాడారు.
అయితే తీవ్ర అనారోగ్యంతో మూడు నెలల పాటు అపోలో ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొలుకుని.. ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆ క్రమంలో బొజ్జల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.






