నాయుడు పేటలో టీడీపీ కార్యాలయానికి నిప్పు
Published on: Mon May 23, 2022 3:41PM
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయాలే టార్గెట్గా వైసీపీ దాడులు జరుగుతున్నాయి. నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షురాలు కె.రేవతిపై ఆదివారం దాడి జరగగా.. నాయుడు పేటలోని టీడీపీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి దుండగులు దాడి చేశారు.
కార్యాలయం తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే కార్యాలయంలోని ఫర్నిచర్ సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగుదేశం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ హుటాహుటిన నాయుడుపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దాడికి బాధ్యులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసుకు విజ్జప్తి చేశారు. నిన్న నగర మహిళా టీడీపీ అధ్యక్షురాలిపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టడంపై పనబాక లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక ఉన్నది వైసీపీయే అని ఆరోపించారు. అధికార మదంతో వైసీపీ వారు ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నరని విమర్శించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపిందని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ జగన్ ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ఆయన వివిధ జిల్లాల్లో రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఓ చర్చ అయితే నెల్లూరులో సాగుతోంది.


