ఈవీల తప్పేం లేదు..బ్యాటరీలే ఓడు..!
posted on: May 9, 2022 7:26AM
కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు అంటూ కేంద్రం ఊదరగొట్టి మరీ జనాల చేత ఈవీ ( ఎలక్ట్రికల్ వెహికల్స్)లను కొనిపించింది. వాటిని తయారు చేసే కంపెనీలకు భారీ రాయతీలనూ ఇచ్చింది. భవిష్యత్ లో ఈవీలదే రాజ్యమన్నంత బిల్డప్ ఇచ్చింది. ఇంత వరకూ బానే ఉంది. జనం ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి ఈవీలను కొనుగోలు చేశారు. తీరా చూస్తే అవి నిప్పుల వాహనాలుగా, మృత్యు శకటాల్లా మారిపోయాయి. ఎక్కడికక్కడ మండిపోతున్నాయి. నడి రోడ్డు మీద, పార్క్ చేసిన స్థలాల్లోనూ, చివరికి ఇంట్లో బ్యాటరీ రీచార్జింగ్ కోసం పెడితే ఆ బ్యాటరీలు కూడా పేలిపోతున్నాయి.
దేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా జరిగాయి. అయితే.. ఇవే ఎలక్ట్రిక్ స్కూటర్లే పెద్ద సంఖ్యలో పేలిపోయాయి, మంటల్లో మాడిపోయాయి. ఆయా సందర్భాలలో వాటి ఓనర్లు మరణించిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో సదరు కంపెనీ అమ్మిన వాహనాలను కాల్ బ్యాక్ చేసింది. లోపాలు సరిదిద్ది మళ్లీ విడుదల చేస్తామంటూ ప్రకటించింది. కేంద్రం కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లలో లోపాలపై దర్యాప్తునకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ నివేదికే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆడలేక మద్దలు ఓడు అన్నట్లు.. కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలతో కొనిపించిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎలాంటి లోపం లేదని కమిటీ తేల్చేసింది. అసలు లోపమంతా బ్యాటరీలలోనే నట. ఈ కమిటీ నివేదికపై అందరూ ఏ రాయి అయితేనేం పళ్లూడటానికి అని వ్యాఖ్యలు చేస్తున్నారు. లోపం ఎలక్ట్రిక్ వెహికిల్ లో ఉంటే ఏమిటి? బ్యాటరీలో ఉంటే ఏమిటి? ఏదైనా నష్టం ప్రజలకేగా అంటూ కేంద్రాన్నినిలదీస్తున్నారు.
అంతే కాదు బ్యాటరీలు పేలిపోవడానికి, వాహనాలు కాలిపోవడానికి బ్యాటరీని సరిగ్గా మేనేజ్ చేయకపోవడం కారణమని కమిటీ నివేదిక తేల్చేసి తప్పు వాహనాల కొనుగోలు దారులదే అంటోంది.






