ఏపీ బడ్జెట్.. అభివృద్ధి, సంక్షేమాలకు సమప్రాధాన్యత

posted on: Feb 14, 2026 7:02AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీలో  ప్రవేశపెట్టనున్నారు. 3.46 లక్షల కోట్ల రూపాయలతో  సరిగ్గా ఉదయం పదకొండు గంటల పదిహేను నిముషాలకు వార్షిక పద్దును పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశ పెడతారు. అంతకు మందు పదిన్నర గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. పయ్యావుల బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక సభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక మండలిలో బడ్జెట్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశ పెడతారు. 

ఇలా ఉండగా పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇది మూడో సారి. ఓటాన్ అక్కౌంట్ ఒకసారి, పూర్తి స్థాయి బడ్జెట్ ను ఒక సారి ప్రవేశపెట్టిన ఆయన.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.  పయ్యావుల పద్దులో అభివృద్ధి- సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుకు ఇతోశిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.   ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు లబ్ది కలిగేలా బడ్జెట్ రూపొందించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. . బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి 10 రోజుల ముందు నుంచి ఆయన  వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శుల నుంచి   ప్రతిపాదనలు స్వీకరించారు.  

ఇలా ఉండగా పయ్యావుల కేశవ్ ఈ రోజు సభలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా విత్తమంత్రి పయ్యావుల బడ్జెట్ రూపొందించారని అంటున్నారు. సూపర్ సిక్స్ హామీల  అమలుతో పాటు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికీ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...