తెలంగాణ ఎంట్రీ టాక్స్పై పిటిషన్లు
Published on: Wed Apr 1, 2015 11:56AM

ఏపీ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుధవారం నాడు మూడు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు బుధవారం నాడే విచారణ చేపట్టే అవకాశం వుంది. ఇదిలా వుండగా తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ వసూలు చేయడాన్ని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని, దీనివల్ల ప్రజల మీద అదనపు భారం పడుతుందని అసోసియేషన్ సభ్యులు చెప్పారు. అదేవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ప్రవేశిస్తున్న వాహనాలపై రవాణాపన్ను వసూలు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు నల్గొండ జిల్లాలోని మూడు చెక్పోస్టుల దగ్గర 150 వాహనాల నుంచి 58 లక్షల టాక్స్ వసూలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా చెక్పోస్టులో 61 లక్షల రూపాయల టాక్స్ వసూలైంది.


