ఇరకాటంలో కావూరి

posted on: May 9, 2012 9:56AM

వివాదాలకు దూరంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు హఠాత్తుగా విమర్శల పాలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్టును ఆయన సూపా పార్వతి అనే మహిళకు ఇప్పించారు. ఈ నిర్ణయం పట్ల జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు కావూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావూరి సాంబశివరావు రాజకీయ వలసపక్షి లాంటివాడని, గతంలో బందరు ప్రస్తుతం ఏలూరు ఎంపిగా ఉన్న కావూరి వచ్చే ఎన్నికల్లో ఎక్కడనుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియాలని, అటువంటి వ్యక్తి జిల్లా పార్టీ వ్యవహారంలో పరిస్థితులు తెలుసుకోకుండా వేలు పెడితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. సూపా పార్వతి అసలు కనగ్రేస్ పార్టీ సభ్యురాలే కాదని అటువంటి వ్యక్తికీ కావూరి టిక్కెట్ ఎలా ఇప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. మొదట పోలవరం టిక్కెట్టును బాడిశ బోజ్జిదొరకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ, కావూరి సాంబశివరావు తన పలుకుబడిని ఉపయోగించి పార్టీకి సంబంధం లేని సూపా పార్వతికి టిక్కెట్టు ఇప్పించారు.

 

 

ఆమె తండ్రి ఒక పార్టీలోనూ, సోదరుడు మరో పార్టీలోనూ పని చేస్తున్నారని అటువంటి కుటుంబంలోని వ్యక్తికీ టిక్కెట్టు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్టు గల్లంతు కావటం ఖాయమని కావూరిని విమర్శిస్తున్నారు. ఏలూరు ఎంపిగా కావూరి ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఇటువంటి వివాదాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. వచ్చే ఉప ఎన్నికల్లో ఆయన సూచించిన సూపా పార్వతి ఓడిపోతే కావూరి మరిన్ని విమర్శలకు గురి కావలసి ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...