Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దోస్తుల్లో దడదడ
posted on: Jul 28, 2022 5:10PM
చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఈ రెండు పేర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్,తెలంగాణా లో పలువురు నాయకులూ,సెలబ్రటిలు గుండెల్లో రైళ్ళు పెరుగేతిస్తున్నాయి.ఇంతకాలం రహస్యం గా సాగిన వారి చీకటి వ్యాపారం ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) దెబ్బతో బట్టబయలైపోయింది. కేసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాలతోపాటు.. మరో ఆరు ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు.
ఆ క్రమంలో ప్రవీణ్.. ల్యాప్టాప్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విచారణకు హాజరుకావాలంటూ ప్రవీణ్ను ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్పై ఈడీ దాడులు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుడివాడలో ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన కేసినోపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే. గుడివాడలో కేసినో నిర్వహణ వెనుక నాటి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని హస్తం ఉందంటూ నాడు విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే. టీడీపీ నేతలు అయితే వరుస ప్రెస్ మీట్లతో కేసీనో వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో కేసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్తో కృష్ణాజిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు లింకులు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందుంచారు. కానీ టీడీపీ నేతల ఆరోపణలను జగన్ ప్రభుత్వం లైట్గా తీసుకుంది. దీంతో టీడీపీ నేతలకు గుడివాడలో కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారమంతా కామ్ అయిపోయింది.
కానీ తాజాగా ఈడీ సోదాలతో కేసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మళ్లీ కేసినో తుట్టె మళ్లీ కదిలింది. మరోవైపు చికోటి ప్రవీణ్.. నిర్వహిస్తున్న ఈ భాగోతం వెనుక బడా బడా నేతలే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై సోమవారం ఈడీ విచారణలో ప్రవీణ్ పెదవి విప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక చికోటి ప్రవీణ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇండో నేపాల్ సరిహద్దుల్లో నిర్వహించిన కేసినోకి వెళ్లిన కస్టమర్ల జాబితాలో 16 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక తెలంగాణలో కేసీఆర్ కేబినెట్లో కీలక మంత్రికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ను.. చికోటి ప్రవీణ్ స్నేహితుడు మాధవరెడ్డి కారుకు తగలించుకొని.. తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలిగా తిరిగేస్తున్నాడట. ఈ విషయంపై సదరు మంత్రి ని మీడియా ప్రశ్నించగా... ఆ కారు స్టిక్కర్ తనదేనంటూ అంగీకరించారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే ఆ స్టిక్కర్ను తొలగించానని.. దానిని ఎవరు తీసుకుని వాడుతున్నారో.. తనకు తెలియదని ముక్తాయించారు.
మరోవైపు ప్రవీణ్, మాధవ్ రెడ్డిపై ఈడీ కన్ను పడడంతో.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీల్లో దడ మొదలైనట్లు సమాచారం. గుడివాడలో కేసినో నిర్వహణకు ముందు గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన స్నేహితుడు, మంత్రి అంటూ కొడాలి నానిని చికోటి ప్రవీణ్కు పరిచయం చేశారనే ఓ టాక్ కూడా అప్పట్లో కృష్ణా జిల్లాలో బలంగా వినిపించిందట. అంతేకాదు.. గుడివాడలో కేసినో నిర్వహణకు ముందే గన్నవరంలో కూడా కేసినో నిర్వహించారని.. కానీ నాడు ఇది అంతా ఫేమస్ కాకుండా.. గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిందని సమాచారం. అది కూడా చికోటి ప్రవీణ్ డైరెక్షన్లో జరిగిందని తెలుస్తోంది. ఏదీ ఏమైనా.. చికోటి ప్రవీణ్ని విచారించిన ఈడీ అధికారులు త్వరలో ఈ దోస్తులను కూడా విచారించే అవకాశం ఉందనే టాక్ అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా సాగుతోంది.


.webp)



