తెలంగాణా బీజేపీ అధికార ప్రతినిధిగా శ్రీమతి జీవిత

 

సినీ నటులు డా.రాజశేఖర్ దంపతుల సినీ జీవితంలాగే రాజకీయ జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇటీవల బీజేపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఎట్టకేలకు డా.రాజశేఖర్ దంపతులు మళ్ళీ ఒక పార్టీవారయ్యారు. మంచి వక్తగా పేరున్న శ్రీమతి జీవితను తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంతో వారిరువురి రాజకీయ జీవితం కూడా ఒడ్డున పడినట్లయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి శ్రీమతి జీవిత తెలంగాణాలో అధికార ప్రతినిధిగా ఉన్నారు కనుక అవసరమయినప్పుడు తమ ప్రియ శత్రువు చిరంజీవి గురించి కూడా గట్టిగా నాలుగు ముక్కలు మాట్లాడుకొనే వెసులుబాటు దొరికిందని చెప్పుకోవచ్చును. పైగా చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా అధికారం కోల్పోయింది కనుక అదనంగా మరో నాలుగు ముక్కలు వేసుకొనే సౌలభ్యం కూడా శ్రీమతి జీవితకుందని చెప్పవచ్చును. ఆమె ఈ ఐదేళ్ళ కాలంలో తన సత్తా నిరూపించుకొన్నట్లయితే ఆమెకు ఏదో ఒకనాడు రాజయోగం ప్రాప్తించే అవకాశం కూడా ఉంటుంది.