Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్.. కేటీఆర్ మధ్య ఎడం పెరిగిందా..?
posted on: Aug 23, 2022 2:45PM
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తథ్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.
అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం లేదు. అందుకు కారణం కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చక పోవడమే అని అంటున్నారు. కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచీ ఆయన ఇప్పుడో అప్పుడో ముఖ్యమంత్రి కావడం ఖాయమని విస్తృతంగా ప్రచారం అయ్యింది. అయితే ఆ ముహూర్తం ఇంత వరకూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే తండ్రి తనకు సీఎంగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో చేస్తున్న తాత్సారం పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందే సీఎంగా కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడం ఖాయమన్న రీతిలో పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం పూర్తిగా నిలిచిపోయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వేసిన అడుగులను ఒక్కటొక్కటిగా వెనక్కు తీసుకునే పరిస్థితులు ఎదురవ్వడంతో ఆయన ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ ను అధికారంలోనికి తీసుకు రావడంపైనే దృష్టి సారించారు. దీంతో కేటీఆర్ కూడా నిర్వేదానికి గురయ్యారని అంటున్నారు.
అందుకే ఇటీవల ఒక సందర్భంగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ కారణంగానే తండ్రి కొడుకుల మధ్య ఒకింత ఎడం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అందకు తగ్గట్టుగానే తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకే వేదికపై ఇటీవలి కాలంలో కనిపించిన దాఖలాలు లేవు. ఆఖరికి స్వాతంత్ర్య వజృత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సమావేశానికి కూడా కేటీఆర్ కనిపించలేదు. కేటీఆర్ మొత్తంగా పార్టీ కార్యక్రమాలకూ, సభలూ సమావేశాలకూ దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు. ఆయన ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలూ, ప్రారంభోత్సవాలలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. అయితే తండ్రితో మాత్రం వేదిక పంచుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఎదురుపడుతున్న దాఖలాలే లేవు.
కేసీఆర్ పాల్గొంటున్న సభలలో కేబినెట్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఒక్క కేటీఆర్ తప్ప. దీంతోనే పరిశీలకులు ఇరువురి మధ్యా ఏదో జరిగిందనీ, తండ్రీ కొడుకుల మధ్య ఎడం పెరిగిందనీ అంటున్నారు. అందుకు కేటీఆర్ సీఎం ఆకాంక్షకు కేసీఆర్ ఎప్పటికప్పుడు కళ్లెం వేయడమేనని విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే.. కేసీఆర్ తనయ కవిత కూడా ఇటీవలి కాలంలో పెద్దగా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు. తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 22)న మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు. అలాగే బోనాల సందర్బంగా బంగారు బోనం సమర్పింస్తూ మీడియా ముందుకు వచ్చారు. చాలా వరకూ ఆమె పార్టీ కార్యక్రమాలకు, బహిరంగ సభలకూ దూరంగానే ఉంటున్నారు. ఇలా కుమారుడూ,కుమార్తె కూడా తండ్రితో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీనిపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నప్పటికీ కుటుంబ కలహాలు కారణమని మాత్రం గట్టిగా వినిపిస్తున్నది. అది కూడా కేటీఆర్ సీఎం ఆకాంక్ష నెరెవేర్చే విషయంలో కేసీఆర్ చేస్తున్న తాత్సారమే కారణమని అంటున్నారు.
అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.
మరోవంక ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు ఎవరూ ఉహాగానాలను కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారు. హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎవరూ కేటీఆర్ సీఎం అన్న మాటే మాట్లాడటం లేదు. అసలా ప్రతిపాదనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామమే కేసీఆర్ పట్ల కేటీఆర్ అలకబూనడానికి కారణమని విశ్లేషణలు వినవస్తున్నాయి.


.webp)
.webp)


