పిల్లి మెడలో గంట కట్టారు.. ఇక ముందుంది క్రొకోడైల్ ఫెస్టివలే ..

posted on: May 21, 2022 10:32AM

వైసీపీ కుండకు చిల్లు పడింది? ఇంతకాలం పార్టీలో నివురు గప్పిన  నిప్పులా ఉన్న అసతృప్తి, మెల్లమెల్లగా పొంగుకోస్తోంది. ఇంతవరకు అధికార పార్టీలో అసంతృప్తికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఒక్కరే చిరునామాగా ఉన్నారు. ఆయన ఒక్కరే పార్టీ, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ‘రచ్చ’ చేస్తూ వచ్చారు. వైసీపీ నాయత్వం కూడా ఆయన్ని అదే రీతిలో సత్కరిస్తూ వస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుని థర్డ్ డిగ్రీ ప్రయోగం కూడా చేసింది. నిజానికి ఎంపీ రాజు పార్టీలో ఉన్నా లేనట్లే, ఆయన సభ్యత్వాని రద్దు చేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్ సభ స్పీకర్’కు ఫిర్యాదు కూడా చేసింది. సో .. పేరుకు వైసీపీ ఎంపీ అయినా, ఇంకే విధంగానూ ఆయనకు పార్టీతో సంబంధ, బాంధవ్యాలు లేవు. ఆయన స్వపక్షంలో విపక్షం కాదు. పార్లమెంట్ లోపలా వెలుపల కుడా విపక్ష ఎంపీగానే వ్యవహరిస్తున్నారు. 

రఘురామ కృష్ణం రాజు విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు అధికార పార్టీ రాజ్య సభ సభ్యుడు (ఎంపీ) పిల్లి సుభాష్ చంద్ర బోసు ఒక్క సారిగా సంచలనం సృష్టించారు. జగన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ దిగేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జరుగుతున్నఅన్యాయాలు, అక్రమాలను ఎండగడుతూ ‘సర్కార్’  వారి దోపీడీని వెలుగులోకి తెచ్చారు. సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి, రెవిన్యూ మినిస్టర్, అంతకు ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రి వర్గంలో వరసగా రెండు సార్లు, రోశయ్య మంత్రివర్గంలో మరోమారు ఇలా ఎంతో కాలం మంత్రిగా పనిచేసిన, పిల్లి సుభాష్ చంద్ర బోసుకు, వైసీపీలో ఉన్నా, గానజయి వనంలో తులసి మొక్కవంటి మంచి నాయకుడు అనే పేరుంది. రాజకీయ ప్రత్యర్ధులు కుడా ఆయన్ని నిజాయతీకి మారు పేరుగానే భావిస్తారు( బహుశా అందుకే కావచ్చు, జగన్ రెడ్డి శాసన మండలి రద్దును బూచిగా చూపించి ఆయన్ని  మంత్రివర్గం నుంచి తప్పింఛి, రాజ్య సభకు పంపారు) అలాంటి పిల్లి సుభాష్ చంద్ర బోసు, ఆంధ్ర ప్రదేశ్’లో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, అందుకు సంబంధించి  తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు.  సీఐడీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అయితే చిత్రంగా సొంత పార్టీ ఎంపీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విచారణకు అదేశించలేదు. పిల్లి మూతికి తాళం వేశారు. ఆయన నోరు నొక్కేశారు.  

అంతేకాదు, పౌర సంబందాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు,  పిల్లి చెప్పింది ఏమంత పెద్ద కుంభకోణం కాదని గురించి కాదన్నారు. బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని కవర్ చేసే ప్రయత్నం చేశారు.అయితే అది దాచేస్తీ దాగే సత్యం కాదు. పిల్లి సుభాష్ చంద్ర బోసు పార్టీ నాయకుల మాటను గౌరవించి మౌనంగా ఉన్నా, ప్రతిపక్షాలు, వైసీపీలోని అసంతృప్త నేతలకు ఇదొక అస్త్రం అవుతుందని అంటున్నారు. పిల్లి మెడలో పిల్లి గంట కట్టారు. ఇక ముందు ముందు ఏమి జరుగుతుంది అనేది చూడవలసి వుందని, అంటున్నారు. 

నిజానికి, ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న అవక తవకల గురించి చాలా కాలంగా, విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ ఎంపీనే ఆరోపణలు చేసిన నేపధ్యంలో ఇప్పుడు విపక్షాల నైతిక బలం పెరిగింది. సో తెలిసి చేసినా, తెలియక చేసినా పిల్లి సుభాష్ చంద్ర బోసు విపక్షాలకు బలమైన అస్త్రాన్ని అందించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవంక గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. నిజానికి ప్రజలు మాత్రమే కాదు, వైసీపీ నాయకులు, కార్యకర్తలే అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయినా ఇంతవరకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో పిల్లి పేల్చిన బాంబు అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టివేసింది. అంతే కాదు. అధికార వైసీపీలో అంతా బాగుంది  అనుకునే పరిస్థితిపోయి, ముందుంది క్రొకోడైల్ ఫెస్టివల్ అనే విధంగా పరిస్థితి మారిందని, పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు, పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఎమ్మెల్యేలు, ముందస్తుకు ఎన్నికలకు వెళితే, గెలిచే అవకాశాలు ఇక లేనట్లే అనే నిర్ణయానికి వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే, జంప్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా అధికార వైసీపీలో అంతా బాగుంది అనుకునే రోజులు వెళ్లి పోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతే కాదు ఒక్క ఛాన్స్’అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగాలేరని, స్పష్టమైన సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...