Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. అసెంబ్లీలో చర్చకు ముఖం చాటేసిన వైసీపీ
posted on: Feb 25, 2026 9:01AM
.webp)
గత కొద్ది కాలంగో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతున్న సంగతి విదితమే. దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని థృవీకరించింది. నిర్ధారించింది. వాస్తవానికి ఇక్కడితో ఈ అంశంవై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరు? అన్నది చట్టం చూసుకుంటుంది.
అయితే వైసీపీ మాత్రం కల్తీ విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నది. అక్కడితో ఆగకుండా తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది. ఇందాపూర్ డైరీ తో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై మండలిలో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. అసెంబ్లీలో చేద్దామంటూ అందుకు మంగళవారం (ఫిబ్రవరి 24)ముహూర్తం నిర్ణయించింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఈ అంశాన్ని మంగళవారం (ఫిబ్రవరి 24) చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది.
వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారంలాంటి అవకాశం. సభకు హాజరై కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా.. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపడానికి అంది వచ్చిన ఒక అవకాశం. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయింది.
ఇక అసెంబ్లీలో మంగళవారం (ఫిబ్రవరి 14) జరిగిన చర్చలో చంద్రబాబు ప్రసంగం.. హైలైట్ గా మారింది. మొత్తంగా కల్తీ నెయ్యి అంశంలో తాను చేసిన ఆరోపణలు, అందుకు ఆధారమైన ఎన్డీడిబీ రిపోర్టు, మొత్తంగా 2022 నుంచి ఏం జరిగింది అనే దానిపై చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సభ ముందుంచారు. ఇక హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల డొల్ల తనాన్ని ఎండగట్టడమే కాకుండా.. భరతీ సిమోంట్స్ కోసం జగన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో కూడా కళ్లకు కట్టారు. హెరిటేజ్ తన కుటుంబ సంస్థ అని చెప్పిన చంద్రబాబు, హెరిటేజ్ ఉత్పత్తులను ఎన్నడూ ప్రభుత్వ శాఖలు తీసుకోలేదని విస్పష్టంగా చెప్పారు. అందుకు భిన్నంగా జగన్ హయాంలో భారతి సిమెంట్స్ ను ప్రభుత్వ నిర్మాణాల కోసం ఉపయోగించిన వైనాన్ని ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు పూనుకున్నామని.. అప్పుడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిందన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తే.. వైసీపీయే సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ నేతృత్వంలోని సిట్ ను కోరిందని గుర్తు చేసిన చంద్రబాబు ఆ సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిందనీ, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందనీ చెప్పారు.
దీనిపైనే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఏకసభ్య కమిషన్ నియమించామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏక సభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ వైసీపీ సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించిదన్న ఆయన ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసిందనీ, తప్పులు చేయడం, విచారణను అడ్డుకోవడాలని ప్రయత్నించడం వైసీపీకి అలవాటేనన్న ఆయన ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వారికి శాపాలుగా మారాయనీ చంద్రబాబు చెప్పారు.
హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ఆరోపణలను సభ సాక్షిగా చంద్రబాబు ఎండగట్టారు. ఆత్మరక్షణ కోసమే వైసీపీ హెరిటేజ్ ను ఇందులోకి లాగిందన్న ఆయన, ఇండాపూర్ అనేది ప్రముఖ డైరీలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ అందిస్తూ ఉంటుందని.. అందులో హెరిటేజ్ ఒకటని పేర్కొన్న చంద్రబాబు.. ఏ ప్రభుత్వ శాఖలో కూడా హెరిటేజ్ ఉత్పత్తులను వినియోగించుకున్న దాఖలాలు కుండబద్దలు కొట్టారు.
అదే సమయంలో తమ ఆరోపణలకు ఆధారాలు చూపుతూ వాదనలు వినిపించాల్సిన వైసీపీ సభ్యులు మాత్రం అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. అటెండెన్స్ కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు వచ్చి వెళ్లిన జగన్ అండ్ కో.. అత్యంత కీలక విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో మాత్రం సభకు డుమ్మా కొట్టి పలాయనం చిత్తగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశీలకులు సైతం సభకు వైసీపీ గైర్హాజర్.. కల్తీ నెయ్యి విషయంలో తప్పు ఒప్పుకున్నదన్న భావన కలిగించేలా ఉందని అంటున్నారు. మొత్తం మీద కల్తీ నెయ్యి విషయంలో చర్చ నుంచి పలాయనం చిత్తగించడంతో వైసీపీ వాదనలు విశ్వసనీయత కోల్పోయాయని రాజకీయవర్గాలు అంటున్నాయి.






