Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంటింటికీ రేషన్.. జగన్ సర్కార్కు కోర్టు మరో మొట్టికాయ
posted on: Jul 19, 2022 5:06PM
భగవంతుని లీలలు ఎవ్వరికీ అర్ధంగావంటారు మతప్రచారకులు. ఎప్పుడు ఏది జరుగుతుందన్నది పరమాత్మునకే ఎరుక అని బోధచేస్తుంటారు. అందువల్ల సామాన్యమానవులం పెద్దగా దాన్ని గురించి ఆలోచించవద్దని, నీతిగా బతకమనీ బోధిస్తుంటారు గురువులు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలనా లీలలు ఆయనంతట ఆయనే ప్రజలకు అర్ధమయ్యేలా చేస్తుంటారు. వ్యర్ధానికి అసలు అర్ధం ఆయనే ప్రజలకు తెలియజేయడం మరెవ్వరివల్లా ఏ ప్రభుత్వం వల్లా కాలేదు. రాష్ట్రంలో పాఠశాలల విలీనం పేరుతో విద్యార్ధులను పక్క వీధికి కాకుండా పది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడేలా చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా గ్రామాల్లో ప్రజలు పక్కనే వున్న పచారీ కొట్టుకు వెళ్లలేరని రేషన్ సరుకునంతా బండ్ల మీద ఇళ్ల వద్దకే తోలుతున్నారు. ఇది వింత విడ్డూరమా.. జగన్ మతి భ్రమించిందా.. అన్న అనుమానాలు యావత్ ఆంధ్రా చర్చించుకుంటోంది. ఒక్క ఆలోచన జీవితాన్నే మారుస్తుందంటారు.. జగన్ ఒక్కో ఆలో చనా ఒక్కోరకం ఇబ్బందికి గురిచేస్తోంది.
జగన్ ఆలోచనతో రాష్ట్రంలో ప్రజలు పచారీకొట్టుకు వెళ్లలేని బద్ధకస్తులా అనే అనుమానం తలెత్తుతోంది. వాహనాలుపెట్టి రేషన్ సామాన్లు అందించే వ్యాపారంతో ఎవరికి లబ్ధి కలుగుతుందో గానీ, ఆ వాహనాలేవో పిల్లల్ని బడికి తీసికెళ్లేందుకు క్యాబ్లుగా పెడితే తల్లిదండ్రులు వేనోళ్ల కీర్తించేవారు కదా జగనన్నా! ఈ సలహాదారులెవరూ ఇటువంటివి చెప్పరేమో! జగన్ ఈ విధంగా ప్రజల ధనం వృధా చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పమని కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లకుండానే ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని కోర్టు పేర్కొంది. వీలు చూసుకుని ప్రజలు అరగంట కేటాయిస్తే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని, ఆ స్థితిలో కూడా పేదలు లేరా అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేషన్ సరుకుల పంపిణీకి డీలర్ కు ఇచ్చే కమీషన్ కంటే డోర్ డెలివరీ ద్వారా ప్రజాధనం భారీగా దుర్వి నియోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
రేషన్ షాపులకు రాకుండా డోర్ డెలివరీ చేయడానికి చేసే ఖర్చుతో పేదలకు మరిన్ని రేషన్ సరుకులు అందించవచ్చని కోర్టు సూచించింది. సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నదని.. మరి కేంద్రం నుంచి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి తీసుకున్నారా, ఏ నిబంధన లను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పథకం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఉద్దేశం సక్రమంగా నెరవేరుతున్నట్లు కనిపించడం లేదన్నారు. మొబైల్ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని ఇంటి వద్దే ఎదురుచూడాల్సి వస్తుం దన్నారు.
ఇంటింటికీ రేషన్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు 92 వేల మందిని నియమించగా, వాహన దారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. రేషన్ డెలివరీ వాహనాల కోసం సైతం రూ.600 కోట్లు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి చోట రేషన్ డోర్ డెలివరీ చేస్తే అర్థం ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాలు సమర్పించాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వాలు పలు విధానాలు అమలు చేస్తాయని అందులో భాగంగా రేషన్ సరుకులని పేద ప్రజలకు ఇంటింటికీ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ శ్రీరామ్. ఇలాంటి ప్రభుత్వ విధాన నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదన్నారు. అయితే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.


.webp)



