Latest News

కేటీఆర్ కు కౌంటర్ సరే.. ఏపీలో కరెంటేది మంత్రిగారూ!

posted on: Apr 29, 2022 3:51PM

మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుంది ఏపీ మంత్రుల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, కరెంటు, నీళ్ల దుస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల స్పందన చూస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా పట్టించుకోని ఆమాత్యులు పొరుగు రాష్ట్ర మంత్రి ఎత్తి చూపితే మాత్రం ఉలిక్కి పడుతున్నారు. గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఓట్ల కోసమే అంటూ పెద్ది రెడ్డి వ్యాఖ్యానించడం ఈ కోవలోకే వస్తుంది. ఒక మంత్రి ఏపీలో ఏమిటి హైదరాబాద్ లోనూ కరెంటు కోతలే అంటు  దబాయించడానికి ప్రయత్నిస్తే..పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణలో కరెంటు కోతలు లేకపోవడానికి ఆ రాష్ట్రంలో సింగరేణి ఉండటమేనన్నారు.

ఏపీలో పరిస్థితి అధ్వానంగా ఉందని అంటే తెలంగాణలో వారికి ( తెరాస) ఓట్లు పడతాయని ఆయన భావిస్తున్నారేమో కానీ..ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకొచ్చారు.  రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు. ఎంత ఖరీదైనా బొగ్గు కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్లివ్వడంలో మంత్రి వర్యులు చూపిన శ్రద్ధ రాష్ట్రంలో సమస్యలపై పెట్టాలని, కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఏపీ వాసలు చెబుతున్నారు. వాస్తవానికి జగన్ హయాంలోనే రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందన్న విమర్శలు ఉన్నాయి. అలాగే నగరం, పట్నం, పల్లె అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు ఉంటున్నాయన్నదే వాస్తవం అన్నది బహిరంగ రహస్యమేనని చెబుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...