మ‌రీ ఇంత క‌క్కుర్తి ఏంటి స్వామీ? జ‌గ‌న్ శిష్యుడైతే చిన్న‌ప‌నుల‌కీ వాడేయ‌డమేనా?

posted on: Jan 6, 2022 4:47PM

స్వ‌రూపానంద స్వామి తెలుసుగా. సీఎం జ‌గ‌న్‌కు గురువర్యులు. జ‌గ‌న్ సీఎం కావ‌డానికి ముఖ్య‌ కార‌ణం ఆ స్వామి వారు చేసిన పూజ‌లు, యాగాలేన‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. స్వ‌రూపానందుల‌ ప్రియ‌శిష్యులు మ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. జ‌గ‌నన్న అప్పుడ‌ప్పుడూ క్రైస్త‌వం రూపం నుంచి హిందుత్వ వేషంలోకి వస్తుంటారని అంటారు. త‌రుచూ విశాఖ పీఠం సంద‌ర్శిస్తుంటారు. గురుశిష్యుల మ‌ధ్య డైరెక్ట్ కాంటాక్ట్ నడుస్తుంటుంది. మ‌రి, శిష్యుడే చీఫ్ మినిస్ట‌ర్‌గా ఉంటే.. ఇక అంత‌కంటే తిరుగేముంటుంది. అందుకే, ముఖ్య‌మంత్రిని, ప్ర‌భుత్వాన్ని ఎంత‌లా వాడేసుకోవాలో అంత‌లా వాడేసుకుంటున్నార‌ట స్వ‌రూపానంద స్వామి. లేటెస్ట్‌గా.. స్వాముల వారికి చెందిన ఓ చిన్న ఓమ్ని బస్‌ సీట్లకు మూడేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలుస్తోంది. ఆ ప‌న్ను మిన‌హాయింపు మ‌రీ పెద్ద మొత్తం ఏమీ కాద‌నుకోండి. అయినా.. అంతచిన్న మొత్తానికి కూడా మిన‌హాయింపు తీసుకోవ‌డ‌మేంట‌నేదే ఇప్పుడు మేట‌ర్‌. ఎంత జ‌గ‌న్ త‌న శిష్యుడే అయినంత మాత్రాన‌.. ఆయ‌న పేరు చెప్పి ప్ర‌భుత్వం నుంచి మ‌రీ ఇంత చిన్న చిన్న ప‌నులు చేయించుకోవాలా? అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. 

గ‌తంలో క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఫెరారీ కారుకు ప‌న్ను మిన‌హాయింపు కావాల‌ని కోరారు. కానీ, కోర్టు మాత్రం అలా కుద‌ర‌దు.. క్రికెట‌ర్ అయినంత మాత్రాన ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డ‌మేంటి? అలాంటి వారు ప‌న్ను మొత్తం క‌ట్టేసి.. స‌మాజానికి ఆద‌ర్శ‌వంతంగా ఉండాలి కానీ.. ఇలా దొడ్డిదారిలో ఎగ్గొట్టాల‌ని చూడ‌కూడ‌దంటూ నాలుగు మొట్టికాయ‌లు వేసి మ‌రీ.. స‌చిన్‌ ముక్కుపిండి మరీ ప‌న్ను క‌ట్టించింది కోర్టు. అది వేరే విష‌యం అనుకోండి.. కానీ, ప్ర‌స్తుతం శార‌దా పీఠానికి చెందిన‌ ఓమ్నీ బ‌స్సు సీట్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న కోసం స్వ‌రూపానంద బాగా కృషి చేస్తే.. ఇప్పుడు తాను సీఎం అయ్యాక జ‌గ‌న్ సైతం గురుద‌క్షిణ బాగానే ముట్ట‌జెప్పుతున్నారా? అనే అనుమానం క‌లుగుతోంద‌ని అంటున్నారు. విశాఖ ఆశ్రమానికి ఇటీవ‌ల పదిహేను ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది ఏపీ కేబినెట్‌. ఇక‌, కబ్జా అని ఆరోపణలు ఉన్న స్థలాల్ని క్రమబద్దీకరించుకున్నార‌ని కూడా అంటారు. తిరుమలలో పీఠం తరపున కట్టిన భవనంకు ఇచ్చిన స్థలం కంటే ఎక్కువే వాడేసి ఆ త‌ర్వాత రెగ్యుల‌రైజ్ చేసుకున్నార‌ని చెబుతారు. గ‌తంలో ఆశ్ర‌మానికి ఆల‌యాల నుంచి విరాళాలు ఇప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినా అది బెడిసి కొట్టిందంటారు. ఇవ‌న్నీ ఆయ‌న స్థాయికి త‌గ్గ‌ట్టే ఉన్నాయ‌ని అనుకున్నా.. తాజాగా త‌న‌ ఓమ్ని బ‌స్ సీట్ల‌కు ప్ర‌భుత్వం నుంచి మూడేళ్ల పాటు ప‌న్ను మిన‌హాయింపు ఇప్పించుకోవ‌డ‌మే కాస్త చీప్‌గా ఉందంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రిని ఇంకా బాగా వాడేసుకోవ‌చ్చ‌నే విష‌యం ఆయ‌న‌కు తెలీడం లేదో.. లేక‌, చిన్నాచిత‌కా పనులు అన్నిటికీ వాడేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారో ఏమో... అంటూ ఎద్దేవా చేస్తున్నారు స్వామి భ‌క్తులు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...