పరిస్థితి ఇలాగే ఉంటే బాంబు పేలుస్తా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on: Jan 28, 2026 12:36PM
.webp)
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే హెచ్చరించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నేరుగా పేరు ప్రస్తావించనప్పటికీ కోమటి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సొంత నియోజకవర్గమైన మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించే విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే, ఏదో ఒక రోజు తాను బాంబు పేల్చడం ఖాయమని ఏకంగా సొంత పార్టీ ప్రభుత్వానికే హెచ్చరిక జారీ చేశారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చి మూడు వారాలు గడిచినా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదన్న ఆయన, తనకు పదవి రాకున్నా పర్వాలేదు కానీ ప్రజల సమస్యలు తీరకపోతే మాత్రం ఎంతకైనా వెడతానని హెచ్చరించారు.




.webp)





