రేవంత్ రెడ్డి అరెస్ట్..కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

 

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా..అరెస్ట్‌కు నిరసనగా జడ్చర్లలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జడ్చర్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు ఓబుదుల్లా కోత్వాల్‌, తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్‌ రాజేందర్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డిని చూసేందుకు అనుమతించాలని పోలీసులతో మల్లురవితోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. రేవంత్‌ అరెస్టుకు నిరసనగా ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.