దుబాయ్‌ శేఖర్‌, శేఖర్‌ మామగా కేసీఆర్ ఎదిగారు

posted on: Dec 1, 2018 1:56PM

 

కాంగ్రెస్ నేత మధుయాష్కి కేసీఆర్ మీద, కేసీఆర్‌ కుటుంబం నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. కేటీఆర్‌ అక్రమాస్తులు నిరూపించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. 2001లో రూ.10లక్షలున్న కేసీఆర్‌ ఆస్తి.. ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. 2009లో రూ.కోటి ఉన్న కేటీఆర్‌ ఆస్తి, 2014లో రూ.41 కోట్లు ఎలా అయిందని నిలదీశారు. మలేషియా, యూఎస్‌ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. బెంగళూరులో కేటీఆర్‌కు బినామీలున్నారన్నారు. డాలర్‌ కాలనీలో కవితకు విల్లా ఎక్కడిదని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబ సంక్షేమమా?.. 4కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తా? ప్రజలు తేల్చుకోవాలని మధుయాష్కీ అన్నారు.
 
కల్వకుంట్ల కుటుంబం అక్రమార్జనను ప్రతిరోజు వివరిస్తానని, రేపటి ప్రెస్‌మీట్‌లో కవిత అక్రమాస్తులను ప్రకటిస్తాని తెలిపారు. హవాయి చెప్పుల హరీష్ రావు బండారాన్ని బయటపెడతానని అన్నారు. కేసీఆర్‌ బతుకేంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. దుబాయ్‌ శేఖర్‌, శేఖర్‌ మామగా కేసీఆర్ ఎదిగారన్నారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారకరామారావు కాదని, కల్వకుంట్ల అజయ్‌రావు అని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబానిది దరిద్రపుగొట్టు చరిత్ర అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్తులను కాపాడుకునేందుకే ప్రధాని మోదీతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా బీజేపీకి మద్దతిచ్చారని అన్నారు. ప్రధాని అయ్యే అవకాశాన్ని సోనియా మూడుసార్లు వదులుకున్నారని, సోనియా కుటుంబానిది త్యాగాల చరిత్ర అని కొనియాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని మధుయాష్కి పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...