ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు

న్యాయస్థానాలను, న్యాయమూర్తులను ఉద్దేశించి ఇటీవల ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని, న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని  మండిపడ్డారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

 

కాగా, మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ వైసీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "న్యాయస్థానాలు గానీ, జడ్జీలుగానీ, చంద్రబాబుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఇప్పుడు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.