కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది

ఆంధ్రప్రదేశ్‌ లో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. 

 

తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. 

 

ఏపీ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్వవస్థీకరణ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.