మంత్రుల నియామకమే కాలేదు కేబినెట్‌ భేటీనా..?

 

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ఇవాళ జరగనుంది. శాసనసభ సమావేశాల నిర్వహణ సహా ఇతర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి వచ్చాక ఇదే తొలి కేబినెట్‌ భేటీ. ప్రగతి భవన్ వేదికగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, మంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు పాల్గొంటారు. మొదటి శాసనసభ సమావేశాలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనిపై కేబినెట్‌ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కోసం ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు మంత్రి వర్గ నియామకం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరపలేదని విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్.. కేబినెట్‌ లో ఉన్న ఒకే ఒక్క మంత్రితో కేబినెట్‌ భేటీ నిర్వహించటం, పలు అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయించనుండటం నియంత పాలనకు నిదర్శనమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.