కవిత దూకుడు.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి!
posted on: Feb 28, 2026 1:45PM
.webp)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు కవితకు నైతిక విజయం అనడంలో సందేహం లేదు. అయితే కవిత కు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో క్లీన్ చిట్ రావడం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరంగా పరిణమించింది. ఎందుకంటే ఈ కేసులో గతంలో ఆమె అరెస్టైన సందర్భంగా బీఆర్ఎస్.. పెద్దగా స్పందించలేదు. ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. అన్నిటికీ మించి కవిత అరెస్టైన సమయంలో ఆమెకు పట్టించుకోని కేటీఆర్.. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువడిన తరువాత.. కవిత అరెస్టు తమకు రాజకీయంగా నష్టం చేసిందని చేసిన వ్యాఖ్యను కవిత నిర్ద్వంద్వంగా ఖండించారు. పార్టీ ఓటమిని తనకు అంటగట్టడానికి చేస్తున్న ప్రయత్నమంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక రెండు నెలలలో తాను కొత్త రాజకీయపార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన కవిత.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు ఆమెను నాయకురాలిగానే కాకుండా ఉద్యమ కారిణిగా కోసం ఫోకస్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పక్కన పెట్టిన తెలంగాణ అజెండా ను ఆమె తన భుజానికెత్తుకోనున్నారన్న సంకేతాలనూ ఇచ్చాయి. కవితకు కోర్టు క్లీన్ చిట్ రాజకీయంగా వెయ్యి ఏనుగుల బలాన్నివ్వడమే కాకుండా.. ఆదే కేసు కారణంగా తనను దూరం పెట్టి ఒంటరిని చేసిన పార్టీ ఇప్పుడు కక్కాలేక మింగాలేక అన్న పరిస్ధితిని ఎదుర్కొంటున్నది.






