21 బంతుల్లో శతగ్గొట్టేసిన క్రికెటర్..!

 

క్రిస్ గేల్ ఐపిఎల్ లో కేవలం 30 బంతుల్లో సెంచరీ కొట్టేసి రికార్డ్ సాధించాడు. ఇక ఎవరూ ఈ రికార్డును బద్ధలుగొట్టలేరని అందరూ అనుకున్నారు. కానీ మరో ఆటగాడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అది కూడా కేవలం 21 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేసి ప్రపంచరికార్డులన్నింటినీ తుడిచేశాడు. ఇరాక్ థామస్ అని పేరున్న ఆ ఆటగాడు కూడా వెస్టిండీస్ వాడే కావడం విశేషం. క్రికెట్ కు టి20 ప్లేయర్లను అందించే వెస్టిండీస్ కు ఇప్పుడు ఈ కొత్త కుర్రాడు దొరికాడు. ప్రపంచపు దృష్టిని  23 ఏళ్ల ఇరాక్ థామస్ ఆకర్షించాడు. త్వరలోనే అతను ఐపిఎల్ టీంకు ఆడితే ఆశ్చర్యపోవక్కర్లేదు. అతని 21 బంతుల సెంచరీలో 15 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. వెస్టిండీస్ లోని ట్రినియాడ్ అండ్ టొబాగోలో జరుగుతున్న టి20 టోర్నీ లో ఈ రికార్డ్ నమోదైంది. లోకల్ గా ఉన్న స్క్రాబరో టీమ్ కు స్ప్రే సైడ్ కు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో స్ప్రేసైడ్ మొదట బ్యాటింగ్ చేసి 152 పరుగులు చేసింది. స్క్రాబరో తరపున ఆడుతున్న ఇరాక్ బరిలోకి దిగి కేవలం 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసేశాడు. మొత్తం 31బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం.