సీమాంధ్ర రాజధానిగా నెల్లూరు: సింహపురి సింహం చిరంజీవి

 

సీమాంధ్రకు నెల్లూరును రాజధానిగా చేస్తానని మాజీ మెగాస్టార్, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ప్రకటించారు. రాష్ట్ర విభజనని ఆపడం ఆయన చేతుల్లో లేకుండా పోయిందగానీ, రాజధానిని నిర్ణయించడం మాత్రం తన చేతుల్లో వున్నట్టు ఆయన మాట్లాడారు. గతంలో ‘సింహపురి సింహం’ అనే ఫ్లాప్ సినిమాలో నటించిన ఆయన ఇప్పుడు సింహపురిని రాజధానిని చేస్తానని ఫ్లాప్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డికి ఎన్నికల ప్రచారం చేయడం కోసం నెల్లూరు జిల్లాకి వచ్చిన చిరంజీవి సోమవారం నాడు తన మనసుకు తోచిన వాగ్దానాలు చేసేశారు. అందులో నెల్లూరును సీమాంధ్ర రాజధానిగా చేస్తాననే ప్రకటన ఒకటి. నెల్లూరును సీమాంధ్ర రాజధానిగా చేస్తానని చిరంజీవి ప్రకటించడం పట్ల ఆ ప్రాంతంలోనే వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నెల్లూరును ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేయాలన్న డిమాండ్ నెల్లూరు జిల్లాలోనే వినిపించడం లేదు. అలాంటిది చిరంజీవికి నెల్లూరు మీద ఎందుకు ఇంత అతి ప్రేమ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.