జగన్ జైలుకు వెళ్ళడం ఖాయం

 

వైసీపీ నాయకుడు జగన్ త్వరలో జైలుకు వెళ్ళడం, ఆయన పార్టీకి తాళం పడటం ఖాయమని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన సత్యసాయిబాబా జయంతి వేడుకలలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద ఇప్పటికే పదకొండు అవినీతి కేసులు ఉన్నాయని, సీబీఐ చార్జిషీట్‌ కూడా దాఖలు చేసిందని, కోర్టులో విచారణ జరుగుతోందని, పరిస్థితులను గమనిస్తే జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయమని తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ అన్ని కేసులలోనూ జగన్ మొదటి ముద్దాయిగా వున్నారని ఆయన గుర్తుచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోయిన ఎర్రచందనం అక్రమ రవాణాలో కాంగ్రెస్ నాయకులు హస్తం స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు సేవలను ఆధునీకరిస్తామని, పోలీసులకు కొత్త వాహనాలను సమకూరుస్తామని హోంమంత్రి రాజప్ప వివరించారు.