నిమ్మగడ్డ కొనసాగింపు పై గవర్నర్ ఆదేశాలకు వైసీపీ షాకింగ్ రిప్లై

posted on: Jul 22, 2020 5:27PM

ఈ రోజు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని పై అధికార పార్టీ వైసీపీ స్పందించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని అయన విమర్శించారు. నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే మళ్ళీ హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని విమర్శించారు.

ఇప్పటికే ఎన్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని గౌరవించాల్సిన పని లేదా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగిన విధంగా నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఎందుకు రహస్యంగా కలుస్తున్నారని ప్రశ్నించారు. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అసలు నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని అయన ప్రశ్నించారు. తనకు సంబంధించిన వ్యక్తులే కీలకమైన పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక ఉండి కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...