పేదరికంపై గెలుపే ఎన్టీఆర్ కి నివాళి

 

నేటి తరానికి ఎన్టీఆర్‌ స్ఫూర్తి ప్రదాత అని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా అమరావతిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ వర్థంతి ఒక సంకల్పదినమన్నారు. సమాజ సేవల్లో చురుకుగా పాల్గొనాలని..పేదల సేవకు పునరంకితం కావాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. పేదరికంపై గెలుపే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని అన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్‌ అని... అందుకే పింఛన్లను 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. పేదల సంక్షేమాన్ని మూడు విధాలుగా చేస్తున్నామన్నారు. నేరుగా నగదు బదిలీ, విద్య, వైద్య, ఆహారం రూపంలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆదాయం పెంచడం.. నెలకు కనీసం రూ.10వేల ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. ప్రజల ఆదాయం పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఇంకా ఎన్నికలకు వంద రోజులే ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని నేతలకు తెలియజేశారు. పార్టీ మనకోసం ఏం చేసింది అనేది కాదని, పార్టీ కోసం మనం ఏం చేయాలని ఆలోచించే సమయం ఇది అని అన్నారు. నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎన్టీఆర్ నేర్పిందే అని అన్నారు. ఇప్పుడు నిరంకుశత్వం భాజపా రూపంలో.. పెత్తందారీ ప్రధాని మోదీ రూపంలో ఉందన్నారు. అందుకే భాజపాపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. రేపు కోల్‌కతాలో బీజేపీయేతర పార్టీల ర్యాలీకి హాజరవుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌, వైసీపీ మినహా అందరూ కోల్‌కతా వస్తున్నారని...దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. మోదీ అనుకూల కూటమి, వ్యతిరేక కూటమి .. రెండే ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌, వైసీపీ.. మోదీ అనుకూల కూటమిలో ఉన్నట్లే అని పేర్కొన్నారు.