రాష్ట్రాన్ని కాంగ్రెస్ చీకటిలోకి నెట్టింది
posted on Mar 27, 2013 5:30PM
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిలోకి నెట్టిందని, కరెంట్ కష్టాలకు ప్రభుత్వమే కారణమని, విద్యుత్ విషయంలో ముందుచూపు లేకపోవడమే దీనికి కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. గత 20 ఏళ్లలో ఇంత సంక్షోభం ఎప్పుడు చూడలేదని, కరెంట్ కష్టాలతో జనం అల్లాడుతున్నారని ఆయన అన్నారు.
టీడీపీ హయాంలో వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంట్ సరఫరా చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఇప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వర్షాలు కురిస్తే కరెంట్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఎగుమతి అవుతోందని, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి సీఎం వద్ద ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ సమస్యపై వామపక్షాలతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుందని, వైఎస్సార్సీపీతో కలిసి పోరాడే సమస్యేలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.