జపాన్లో చంద్రబాబు బిజీ
Published on: Mon Jul 6, 2015 11:00AM

జపాన్ పర్యటనలో వున్న ఏపీ ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్లో వున్నారు. ఆయన సోమవారం నాడు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఫుజి ఎలక్ట్రిక్ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుజి సంస్థ విజయవాడలో పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం చేపట్టింది. ఆ సంస్థకు ఏపీ ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. నవంబర్లో జరిగిన ఎంఓయు పురోగతిని సంస్థ ప్రతినిధులు చంద్రబాబు బృందానికి వివరించారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఫుజి సంస్థ ప్రధాన ప్రాజెక్టును చేపట్టనుంది. ఇక మిత్సుబిషి సంస్థ విశాఖలో సమాచార అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కృష్ణాజిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. కృష్ణపట్నంలో క్లస్టర్ ఏర్పాటుకు కూడా అవకాశాలు వున్నాయి. తాజా పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో తమ పరిశ్రమకు రహదారిని నిర్మించాలని సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. దీనికి స్పందించిన ఆయన వంద రోజుల్లో రహదారిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.


