జగన్‌రెడ్డి పుట్టకముందే ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్సా? 

posted on: Jan 5, 2022 3:20PM

రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందని, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని వైసీపీ ధ్వంసం చేసిందని టీడీసీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.బాధితుల త‌ర‌ఫున త‌మ పార్టీ పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానికంగా వైసీపీ నేత‌లు పాల్ప‌డుతోన్న మోసాలను ఎండ‌గ‌ట్టాల‌ని త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. వైసీపీ నేత‌లు చేస్తోన్న త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెప్పాల‌ని తెలిపారు. టీడీపీ త‌ర‌ఫున నియోజ‌క వ‌ర్గాల్లో నిర‌స‌న‌లు తెల‌పాల‌ని పిలుపునిచ్చారు.

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటికొస్తే చాలు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో బూతులు తప్ప ఏమీ లేవన్నారు. న్యాయ వ్యవస్థపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టించారని ఆరోపించారు. టీడీపీకి అధికారం కొత్తకాదని, ప్రతిపక్షం కొత్త కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు ఈ సమాజానికే కొత్తని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్‌రెడ్డికి వ్యక్తిత్వం లేదు, విశ్వసనీయత అంతకంటే లేదని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు మర్చిపోయినా చరిత్ర జగన్‌రెడ్డిని క్షమించదన్నారు. ఇలాంటి మూర్ఖపు సీఎంని తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. మార్చి 29నాటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు అవుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ వందేళ్ల జయంతి ఉత్సవాల్ని చేసుకోబోతున్నామన్నారు. సుపరిపాలన అందించిన ఘనత టీడీపీదేనన్నారు. రాష్ట్ర విభజన కన్నా జగన్‌ రాష్ట్రానికి చేసిన డ్యామేజ్‌ ఎక్కువన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఒక్క పెట్టుబడి రాలేదని... అప్పులు మాత్రం రూ. 7 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబు విమర్శించారు.

జగన్‌రెడ్డి పుట్టకముందే ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్సా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లు ఇవ్వడానికి కూడా సీఎంకు మనసు రాలేదని దుయ్యబట్టారు. చెత్తపన్ను కట్టకపోతే  చెత్తను ఇంటిముందు వేయ్యాలంటున్నారని, ఆరోగ్యం, విద్యా రంగాలను కూడా నాశనం చేశారన్నారు. ఇంగ్లీషే తిండి పెడుతుందని మాట్లాడారు.. తెలుగు మీడియంలో చదివిన వారికీ విదేశాల్లో ఉద్యోగాలొచ్చాయన్నారు. నాయకుడు ధైర్యంగా లేకపోతే కార్యకర్తలకు ఇబ్బందులొస్తాయన్నారు. ప్రజల్ని పోరాటాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...