సీఎం మోస‌పు రెడ్డి.. కేబినెట్‌తో జ‌గ‌న్ వీక్‌నెస్ బ‌య‌ట‌ప‌డింద‌న్న చంద్ర‌బాబు

posted on: Apr 18, 2022 4:14PM

సీఎం మోసపు రెడ్డి పాలనతో అన్నివర్గాల జీవితాల్లో అంథకారం అలుముకుందని.. రాష్ట్రం రివర్స్‌లో నడుస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. జగన్ సొంతవర్గం కూడా తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉందన్నారు. సీఎం అపరిచితుడి నిర్ణయాలతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. 

ముఖ్యమంత్రి ఎంత బలహీనుడో అతని కేబినెట్‌ చూస్తేనే అర్థమవుతోందని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడిందని.. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనని ఆరోపించారు. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందన్నారు. 

ప్రాజెక్టులో నాడు జగన్ చేసిన పాపాలే.. పోలవరానికి నేడు శాపంగా మారాయ‌న్నారు. రివర్స్ టెండర్ల నిర్ణయం, పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా 2020 లో పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. రివర్స్ టెండర్లలో ప్రజాధనం ఆదా అని గొప్పలు చెప్పిన జగన్… ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్ల జరిగిన నష్టానికే రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు చంద్రబాబు. 

ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ మూడేళ్ల పాలనలో నష్టం పోని వర్గం అంటూ ఏదీ లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. రాష్ట్రానికి వైసీపీ పాలన అరిష్టంలా దాపురించిందని.. పన్నులు, చార్జీల పెంపుతో ప్రజల కష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలు కారణం అవుతున్నాయని మండిప‌డ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందనే ఇందుకు సాక్ష్యం అని ఆయన చెప్పారు. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామ‌ని.. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో అధినేత ప్ర‌క‌టించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...