యూపిఏ దేశాన్ని భ్రష్టు పట్టించింది: బాబు
posted on Aug 20, 2013 3:04PM
యూపిఏ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక వృద్ధి రేటు తగ్గటం వల్ల నిరుద్యోగం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెసు పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. అవినీతి విచ్చవిడిగా పెరిగిందని, ధరలు పెరుగుతున్నాయని, యూపిఏ ప్రభుత్వం కుంభకోణాలమయమని దుయ్యబట్టారు.
దేశ ప్రజల అన్ని రకాల కష్టాలకు బరితెగించిన కాంగ్రెసు పాలననే కారణమన్నారు. ప్రధానమంత్రి సంతకం చేసిన పైళ్లు మాయమవుతున్నాయని విమర్శించారు. అన్నింటిలోకి ఎఫ్డిఐలను అనుమతించినా పెట్టుబడులు రావడం లేదని, మరోవైపు రూపాయి విలువ పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఎవరికి తోచినట్టు వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుకు కారకులెవరని ప్రశ్నించారు. ఫైల్ మిస్సింగ్ పైన ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని అన్నారు.