ఘనంగా చంద్రబాబు బర్త్ డే

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 66వ పుట్టినరోజు వేడుకలు సోమవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగాయి. పార్టీ కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేక్ కట్ చేసి, అందరి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని అన్నారు. అందరి త్యాగాల ఫలితం కారణంగానే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థాయికి ఎదిగిందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ‘‘నా జీవితం తెలుగు జాతికి అంకితం. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటున్నాను. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాను’’ అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేద పండితులు ఆశీస్సులు అందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేత్ర, దంత వైద్య శిబిరాలతోపాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంధులకు బ్రెయిలీ ల్యాప్‌టాప్‌లను అందజేశారు.