TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రుణ గోస.. ఏపీతో కేంద్రం ఫుట్ బాల్!

Published on: Thu Apr 28, 2022 2:24PM

ఏపీ అప్పులపై కేంద్రం సీరియస్ గా ఉంది. నిబంధనలను ఖాతరు చేయకుండా ఇష్టారీతిన అప్పులు చేయడమే కాకుండా.. వాటి వ్యయానికి సంబంధించి కేంద్రానికి పంపిన నివేదిక తప్పుల తడకగా ఉండటంతో.. ఏపీ నివేదికలు వెనక్కు పంపడమే కాకుండా.. కొత్త అప్పులు కావాలంటూ వచ్చిన ఏపీ ఆర్థిక కార్యదర్శికి కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు   వీర లెవెల్లో క్లాస్ పీకినట్లు సమాచారం.  

అంతే కాకుండా చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్రం సమర్పించిన నివేదినకు వెనక్కు పంపి...తాము కోరిన వివరాలను పొందుపరుస్తూ సమగ్ర సమాచారంతో  తమ ఎదుట హాజరు కావాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖను కేంద్ర అధికారలు  ఆదేశించారు. ఏపీ ఆర్థిక తీరుతెన్నులపై కేంద్రం సీరియస్ నెస్ చూస్తుంటే రాష్ట్రానికి కొత్త అప్పులు పుట్టే అవకాశం దాదాపు మృగ్యమనే అభిప్రాయం ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు రాష్ట్ర జీఎస్డీపీలో 3.5 శాతం మాత్రమే రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం గతంలో అర్హతకు మించి రుణం తీసుకోవడంతో వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఆ మేరకు రుణం తీసుకునే మొత్తంలో మినహాయింపు అనివార్యమని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చేసిందని చెబుతున్నారు. ఏపీ రుణాల సమీకరణకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఇందుకే కేంద్రం కోరింది. 

ఈ పరిస్థితుల్లోనే  కేంద్రం అధికారులు క్లాస్ పీకడంతో.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి, అటు కేంద్రం ఆగ్రహం నేపథ్యంలో ఏపీ ఆర్థిక కార్యదర్శి సెలవుపై వెళ్లారని చెబుతున్నారు. ఏపీ ఆర్థిక కార్యదర్శి రావత్ సెలవుపై వెళ్లడంతో ఇప్పుడు కేంద్ర కోరిన వివరాలను తయారు చేయడంలో కన్సెల్టెంట్లను రంగంలోనికి దింపిన ఏపీ సర్కార్, ఆర్థిక శాఖకు చెందిన మరో ముఖ్య అధికారికి పర్యవేక్షణ బాధ్యతను అప్ప గించింది. 

కాగా ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి, రుణ సమీకరణలపై ఒక అభిప్రాయానికి వచ్చిన కేంద్ర వ్యయ విభాగం.. ఏపీ నుంచి సమగ్ర వివరాలు అందకపోవచ్చుననే నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. అందుకే అవసరమైన సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేకరించేందుకు రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు.   ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రానికి కొత్త అప్పులకు అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు.