అగ్నిపథ్ పథకంపై కేంద్రం సమీక్ష
posted on: Jun 17, 2022 11:53PM
ఆర్మీ రిక్రూట్ మెంట్ లోకోసం ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై కేంద్రం శనివారం సమీక్ష నిర్వహించనుంది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగి వచ్చింది. ఈ పథకంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో శనివారం సమావేశమై సమీక్షించనున్నారు.
అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలలో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా యువత నుంచి అగ్నిపథ్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
విపక్షాలు కూడా అగ్నిపథ్ ఆర్మీని అవమానించడమేనంటే విమర్శలు చేశాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం ఒక మెట్టు దిగింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులు సమావేశమై అగ్నిపథ్ పై సమీక్షించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనకు తలొగ్గి మోడీ ఆ చట్టాలను వెనక్కు తీసుకోవడమే కాక రైతులకు క్షమాపణ చెప్పిన సంగతి విదితమే. ఇప్పుడు అగ్నిపథ్ విషయంలో కూడా వెల్లువెత్తిన వ్యతిరేకతకు తలొగ్గి కేంద్రం సమీక్షించాలని నిర్ణయించింది.






