Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శతవసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం
posted on: Apr 19, 2026 5:20PM

చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర యూనివర్సిటి .. ఏయూ ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్’. ఎంతోమంది ప్రముఖులను అందించిన ‘ఏయూ’ వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఆదివారం (ఏప్రిల్ 19) నుంచి ఏప్రిల్ 26 దాకా... విశాఖ వేదికగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
దేశంలో తొలి భాషా ప్రయుక్త విద్యా సంస్థగా ‘ఏయూ’ అవతరించింది.
దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ‘విశ్వకళాపరిషత్’ అనే పేరు ఏయూకు మాత్రమే ఉంది. పేరుకు తగినట్టుగానే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్ర లేఖనం, రంగస్థలం, శిల్పం వంటి కళలకు యూని వర్సిటీలో కోర్సులుగా స్థానాన్ని కల్పించారు. లక్షలాది మందిని విద్యావంతులను చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన అతి కొద్ది వర్సిటీల జాబితాలో చేరింది.
1913 మే 26న బాపట్ల టౌన్ హాలులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు విశాఖకు చెందిన భయ్యా నరసింహశర్మ అధ్యక్షత వహించారు. ఆ సభలోనే కొందరు తెలుగు ప్రజలకు విశ్వవిద్యాలయం ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న అన్నెపు పరశురాం పాత్రో వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో వర్సిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీకి స్థలం, నిధులు సమకూర్చుతామని విశాఖకు చెందిన పలువురు హామీ ఇవ్వడంతో 1930 సెప్టెంబరులో ఇక్కడికి తరలించారు.
అప్పటికే ఉపకులపతిగా ఉన్న సర్ సీఆర్ రెడ్డిఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. విజయనగరం, కురుపాం, జయపురం జమీందార్లతోపాటు నగరానికి చెందిన కొందరి సహకారంతో ఏయూ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలో 20 బీఈడీ, 20 డిగ్రీ హనర్స్ కాలేజీలు ఏయూ పరిధిలోకి వచ్చాయి. 1923లో పెట్టిన ఆంధ్ర మెడికల్ కాలేజీని కూడా ఏయూ పరిధిలోకి తీసుకువచ్చారు. అలా, పరిపాలన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి స్నాతకోత్సవాన్ని 1927లో విజయవాడలో నిర్వహించారు.
ఆంధ్ర యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్గా సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వీఎస్ కృష్ణ తదితరుల ప్రముఖులు. సర్ సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇక్కడ పాఠాలు బోధించారు. సర్ సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పని చేస్తున్న కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయూను సందర్శించారు. పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రామస్వామి తదితరులు ఏయూ పూర్వ విద్యార్థులే.
పూర్వ విద్యార్థుల్లో ఐదుగురు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు, ఇద్దరు పద్మవిభూషణ్, ఒకరు పద్మభూషణ్, ఐదుగురు పద్మశ్రీ అవార్డులు కైవసం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏయూలో మెరైన్ ఇంజినీరింగ్, వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రం, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాలు ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. ఏటా వర్సిటీలో చేరడానికి లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే వర్సిటీలోని వివిధ కళాశాలల్లో దాదాపు 10000 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
వర్సిటీ తొలినాళ్లలో నాలుగు కోర్సులు, 20 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ప్రస్తుతం 450 ఎకరాల్లో వర్సిటీ ఉంది. 215 భవనాలతో వర్సిటీ నిర్వహిస్తున్నారు. 58 విభాగాలు, 16 ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, 188 ఐసీటీ అనుసంధాన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, జీఐఎస్ ల్యాబ్లు, 76 సమావేశ మందిరాలతో వర్సిటీ విరాజిల్లుతోంది. ఈ క్రమంలోనే దూరవిద్యను ఏర్పాటు చేశారు.
ప్రతి చిహ్నాలకు అర్థం స్ఫురించేలా ఆంధ్ర యూనివర్సిటీ లోగోను డిజైన్ చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడి బొమ్మ విశ్వవిద్యాలయాన్ని, వర్సిటీలోని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతిని ప్రతిబిం బించేలా రూపొందించారు. సూర్యకిరణాలపై ఆర్యుల దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయట వృత్తం, భారతదేశ శాస్ర్తీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్ర్తాలను సూచిస్తుంది.
ఇక సముద్రాన్ని విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞాన కేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులోని "తేజస్వినావధీతమస్తు" అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. లోగోలోని దిగువ భాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకులు జ్ఞానాన్ని కోరుకునే వారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అలాగే, పురాతన కాలం నుంచి ఆంధ్రుల్లో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్ర్తి రూపొందించారు.
తొలుత విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన ఏయూను విశాఖకు తరలించారు. అయితే, అనూహ్య పరిణామాలతో మరోసారి గుంటూరుకు వర్సిటీని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏయూ ప్రాంగణమంతా సైనిక స్థావరంగా మారిపోయింది. 1942 ఏప్రిల్ 6న విశాఖ హార్బర్పై జపాన్ బాంబులు వేసింది. ఆ దాడి తరువాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు వినియోగించుకోవాలని అప్పటి బ్రిటీష్ సైన్యం భావించింది.
యూనివర్సిటీని మార్చాలని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తరువాత 1942 ఏప్రిల్ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేశారు. కెమిస్ట్రీ విభాగం మినహా మిగిలిన విభాగాలు గుంటూరుకు మారాయి. కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాల్నింటినీ సైన్యం ఆక్రమించుకోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం 1945 జూన్ వరకు... అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం బయట నుంచి పని చేసింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నూరేళ్లకు పైగా విద్యను అందిస్తూ, ఎంతోమంది జీవితాల్లో విజ్ఞానకాంతుల్ని వెలిగిస్తూ గత ఏడాది ఏప్పిల్ 26 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. వందేళ్లు పూర్తిచేసుకున్న విశ్వ విద్యాలయాల జాబితాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలవడం నిజంగా ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమే.






