Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నామినేటెడ్ పదవులు... చాణక్య చంద్రబాబు!
posted on: Sep 25, 2024 12:32PM

నామినేటెడ్ పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్న కూటమి పార్టీలలో అసంతృప్తి వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలలో తెలుగుదేశం వ్యతిరేకులను దూరం పెట్టడంలోనూ జాగ్రత్త వహిస్తున్నారు. ఇన్ని పరిమితుల మధ్య సొంత పార్టీ నేతలకు పదవుల విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న అసంతృప్తిని గమనించడం లేదా అన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గీయులలోనే వ్యక్తం అవుతోంది.
ఆ సంగతి కొద్ది సేపు పక్కన పెడితే కూటమి పార్టీలలో అసంతృప్తి వ్యక్తం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే.. ఆయా పార్టీలలో మరీ ముఖ్యంగా బీజేపీలో వైసీపీకి అనుకూల నేతలను పూర్తిగా పక్కన పెట్టేయడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పవచ్చు. తొలుత నామినేటెడ్ పదవులకు రంగం సిద్ధం అయ్యిందన్న వార్తలు రాగానే బీజేపీ తరఫున ఆ పదవులకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిఫారసు చేసిన నేతలలో తెలుగుదేశం నేతలు, శ్రేణులకు సుతరామూ ఇష్టం లేని కొన్ని పేర్లు ఉన్నాయి. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలంటూ బీజేపీ సిఫారసు చేయడం తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వారి పేర్లను స్వయంగా బీజేపీ హై కమాండే ఉపసంహరించుకునేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇందు కోసం నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి మంగళవారం (సెప్టెంబర్ 24) ఆయన ఓ 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఆ జాబితాలో బీజేపీలోని వైసీపీ అనుకూల నేతల పేర్లు లేవు. అయినా బీజేపీ నుంచి ఇసుమంతైనా అసంతృప్తి వ్యక్తం కాలేదు. ఇది కచ్చితంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే.. కూటమి పార్టీల్లోని తెలుగుదేశం వ్యతిరేకులను పక్కన పెట్టేయడం చంద్రబాబు చాణుక్యమే. అంతే కాదు.. ఇప్పుడే కాదు, భవిష్యత్ లోనూ అటువంటి వారికి ఎటువంటి అవకాశాలూ ఉండవని స్పష్టం చేయడమే.
మంగళవారం (సెప్టెంబర్ 24) చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో బీజేపీ నుంచి కేవలం లంకా దినకర్ కు మాత్రమే పదవి లభించింది. ఆయన తెలుగుదేశం మాజీ నాయకుడే. ఇక జనసేన నుంచి ముగ్గురికి పదవులు లభించాయి. ఇక తెలుగుదేశం కు 16 పదవులు లభించాయి. అన్ని సమీకరణాలనూ పరిగణనలోనికి తీసుకుని సమగ్ర కసరత్తు తరువాతే చంద్రబాబు నామినేటెడ్ పోస్టులకు నేతలను ఎంపిక చేశారని ఆ పదవులు దక్కిన వారి పేర్లను బట్టి అర్ధమౌతోంది.
ఇక ఇప్పుడు తెలుగుదేశంలో అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తం కావడం విషయానికి వస్తే.. ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండటంతో.. పలువురు తెలుగుదేశం నాయకులు జగన్ అరాచక పాలనలో అన్ని విధాలుగా వేధింపులకు, దాడులకు, దౌర్జన్యాలకూ గురై ఇబ్బందులు పడ్డారు. వారి జాబితా చాలా చాలా పెద్దదే. అటువంటి వారంతా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కనుక ఏదో ఒక పదవి ఆశించడం సహజమే. అయితే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, ఒకే విడతలో అందరినీ సంతృప్తి పరిచేలా పదవుల పందేరం అంత సులభ సాధ్యం కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకూ ఆ విషయం తెలుసు. అయినా వారిలో అసంతృప్తికి కారణం లేకపోలేదు.
ఎన్నికలలో తెలుగుదేశం అఖండ విజయంతో తమ పాత్రకు తగిన గుర్తింపు లభించలేదన్నదే ఆ అసంతృప్తికి కారణం. ఈ విషయాన్ని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిథి జీవీకే బాహాటంగానే వ్యక్తం చేస్తే, మరో జాతీయ అధికార ప్రతినిథి పఠాభి మాత్రం తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. గుర్తింపు లభించడం అంటే ఏంటన్న ప్రశ్నకు వారిచ్చిన సమాధానాల సారాంశం ఏంటంటే... పార్టీ నుంచి కమ్మూనికేషన్. పార్టీ విజయం సాధించిన తరువాత ఇంత వరకూ పార్టీ అధినేతను కలిసే అవకాశమే తమకు దక్కలేదన్నది వారిలో అసంతృప్తికి అసలైన కారణం. తాము పదవుల కోసం పార్టీలో లేమనీ, పార్టీ అధికారంలో ఉండాలన్న సంకల్పంతో జగన్ హయాంలో ఎన్నో ఇబ్బందులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని నిలబడ్డామని, అటువంటి తమకు పార్టీ అధినేత అప్పాయింట్ మెంట్ కూడా దక్కకపోవడం ఒకింత అసంతృప్తి కలిగించిందనీ చెబుతున్నారు. ఈ విడత నామినేటెడ్ పదవులలో మీకు అవకాశం లేదు.. తరువాత చూద్దాం అన్న ఒక్క సందేశం పార్టీ అగ్రనాయకత్వం నుంచి తమకు అంది ఉంటే బాగుండేదనీ వారు అంటున్నారు. నిజమేకదా?!






