గోదావరి పెన్నా ప్రాజెక్టుకు సహకారం.. కేంద్ర మంత్రులు సానుకూలం

posted on: Nov 16, 2024 10:02AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో యమా బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అవసరాలు ఆకాంక్షలను తెలియజేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. శుక్రవారం (నవంబర్ 15) అసెంబ్లీ  సమావేశాల అనంతరం హస్తిన బయలుదేరి వెళ్లిన చంద్రబాబుకు అక్కడ తెలుగుదేశం ఎంపీలు స్వాగతం పలికారు. వారితో భేటీ అనంతరం చంద్రబాబు విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఆ భేటీలో దేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, పౌరులు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలపై జైశంకర్ తో చంద్రబాబు  చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.  
అలాగే ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై చంద్రబాబు జైశంకర్ కు వివరించారు. విదేశాల నుంచి కంపెనీలను ఏపీకి పంపేందుకు సహకరించాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో ఎంతో కీలకమైన సింగపూర్ తో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న చంద్రబాబు వినతి పట్ల జైశంకర్ సానుకూలంగా స్పందించి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

 ఇక కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నదుల అనుసంధానం ఎంతో కీలకమని చెబుతూ గోదావరి, పెన్నా ప్రాజెక్టుకు సహాయ సహకారాలందించాలని కోరారు. చంద్రబాబు వినతికి విత్త మంత్రి సానుకూలంగా స్పందించారు.   మొత్తం మీద చంద్రబాబు  రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, రాష్ట్ర పురోగతికి కేంద్రం సహకారం లక్ష్యంగా  హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...