అప్పుడు నిజాయితీ..ఇప్పుడు అవినీతి

posted on: Jan 5, 2019 1:23PM

 

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రకళ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆమె నివాసంతో పాటు... ఏకకాలంలో దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మైనింగ్ స్కామ్‌లో చంద్రకళపై ఆరోపణలు రాగా కేసు నమోదు చేసిన సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. చంద్రకళ మైనింగ్ స్కామ్‌లో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపణలున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దాడులు నిర్వహిస్తోంది.

చంద్రకళ స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా. ఆమె తండ్రి ప్రస్తుతం రామగుండంలో పనిచేస్తున్నారు. అయితే, 2008 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌కు చెందిన చంద్రకళ... రాజకీయ నేతలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. గతంలో ఓ కాంట్రాక్టర్ సరఫరా చేసిన నాసిరకం ఇటుకలు మీడియా సమక్షంలో పగలగొట్టిన చంద్రకళ... మొత్తం వెనక్కి పంపించారు. ‘మీరు చేసే పని ఇదేనా? మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీలో కొద్దిగైనా నైతికత అనేది ఉందా? ప్రజాధనం ఎలా వృథా చేస్తారు? మీరు సిగ్గుతో తలదించుకోవాలి’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు సైతం నిజాయితీ గ‌ల ఆఫీస‌ర్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కూడా కురిపించారు.

ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ సొతం చేసుకున్న చంద్రకళ.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు సంపాదించారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భార‌త్ మిష‌న్‌కు చంద్రక‌ళ‌ను డైరెక్టర్ గా నియ‌మించారు. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాట‌ర్ అండ్ శానిటేష‌న్ శాఖ‌, కేంద్ర తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖ ఉపకార్యదర్శిగా బాధ‌త్యల‌ను అప్పగించారు. బులంద‌ర్‌షెహ‌ర్‌, బిజ్నూర్‌, మీర‌ట్ న‌గ‌రాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని ఆమె విజయవంతంగా నిర్వహించారు. ఇంతటి పేరు తెచ్చుకున్న చంద్రకళపై ప్రస్తుతం అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...