మాజీ సీఎం ఇంట్లో సీబీఐ దాడులు

posted on: Jan 25, 2019 11:57AM

 

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హూడా ఇంట్లో సీబీఐ దాడులు జరుగుతున్నాయి. రోహతక్‌లోని హుడా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గురుగ్రామ్‌లోని 1,300 ఎకరాల భూ కుంభకోణం విషయంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో హుడాకు సంబంధం ఉందనే ఆరోపణలతో ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారి ఇళ్లపై కూడా దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు దాదాపు 30 చోట్ల సోదాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అసోసియేట్‌‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ భూమిని అక్రమంగా ఇతరులకు కేటాయించారన్న కేసులో కొద్ది రోజుల క్రితమే హుడాకు పంచకుల సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2005లో హర్యానాలోని పంచ్‌కులలో ఏజేఎల్‌కు ప్లాట్‌ను రీ అలాట్‌ చేయడంపై గత ఏడాది డిసెంబర్‌లో హుడాపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇండస్ట్రియల్ ప్లాట్‌ల కేటాయింపునకు చివరి తేదీ 2012 జనవరి 6 కాగా, జనవరి 24న దరఖాస్తు చేసుకున్న 14 మందికి భూమిని నామమాత్రపు ధరకు కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. అలాగే పంచ్‌కులలో సీ-17 ప్లాట్‌ను రీ అలాట్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ 67 లక్షల నష్టం వాటిల్లిందని ఆరోపించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...