ప్రశాంత్ కిషోర్ పై రఘోపూర్ లో కేసు
posted on Oct 15, 2025 1:04PM

బీహార్ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదైంది. బీహార్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ.. ఈ కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వందల వాహనాలతో ఆయన ర్యాలీగా రఘోపూర్ కు వచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా రఘోపూర్ లో మంగళవారం (అక్టోబర్ 14) ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన అమేథీలో రాహుల్ గాంధీ ఎలా ఓటమి పాలయ్యారో.. అదే విధంగా రఘోపూర్ లో తేజస్వి యావ్ పరాజయం పాలు కాబోతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. వాస్తవానికి రఘోపూర్ తేజస్వి యాదవ్ కు పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ప్రశాంత్ కిషోర్ తేజస్వియాదవ్ ను టార్గెట్ చేసుకుని అక్కడ నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి తేజస్వియాదవ్ కు ప్రత్యర్థిగా తన జన సూరజ్ పార్టీ తరఫున తానే అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ముందుగా భావించిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు.
ఈ సారి ఎన్నికలలో తాను వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. రఘోపూర్ తో జనసురాజ్ అభ్యర్థిని గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే తేజస్వి యాదవ్ ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. రఘోపూర్ లో విజయావకాశాలు లేకపోవడంతో తేజస్వి మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయన్న ఆయన.. ఆయన మరో చోట ఎక్కడైనా పోటీ చేయనివ్వడం.. రఘోపూర్ లో మాత్రం ఆయనను ఓడించి తీరుతామని ఉద్ఘాటించారు. కాగా ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు తేజస్వియాదవ్ కు కలవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ, ఆయన అందుబాటులో ఉండరనీ చెప్పారు. అలాగే స్థానిక సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.