టిఫిన్ చేయడానికి కారులో వెళ్లి..  హుస్సేన్ సాగర్లోకి..

వాళ్లు ముగ్గురు స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్లలో ఒకరు నాలుగు రోజుల క్రితం కారు కొన్నాడు. దీంతో మూడు రోజుల నుంచి ముగ్గురు స్నేహితులు కొత్త కారులో షికారు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రంతా కారులో హైదరాబాద్ తిరిగారు. తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు బయలుదేరారు. అయితే కారు అదుపు తప్పింది. హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ముగ్గురు స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది . అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎన్టీఆర్ పార్క్ ఎదుట హుస్సేన్సాగర్లోకి దూసుకెళ్లింది .దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది . అందులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . కారులో ఉన్న యువకులను బయటకుతీసి .. యశోద దవాఖానకు తరలించారు.

ఈ కారు ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యువకులను ఖైరతాబాద్ కు చెందిన నితిన్ , స్పత్రిక్ , కార్తీక్ గుర్తించారు . కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నారని , ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.