Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రపతి, గవర్నర్ లకు గడువు విధించలేం.. సుప్రీం
posted on: Nov 20, 2025 11:42AM
.webp)
చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలప పరిమితి నిర్ణయించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించింది. దీంతో ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠకు తెరపడింది. అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది.
దీంతో.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా కోరారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.
రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ.. గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.
ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా గురువారం (నవంబర్ 20) సుప్రీం తీర్పు వెలువరించింది.
చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు ఎటువంటి గడువూ విధించలేమని సుప్రీం తీర్పు రాజ్యాంగ ధర్మాసనం విస్పష్ట తీర్పు వెలువరించింది. అయితే బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ సుదీర్ఘ సమయం తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం కోర్టులకు ఉందని పేర్కొంది. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల ముందు వాటిని ఆమోదించడం లేదా రాష్ట్రపతికి పంపడం, అదీ కాకుంటే.. వాటిని తిరిగి అసెంబ్లీకి తిరిగి పంపడం వినా మరో మార్గం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.


.webp)



