Latest News

కాగ్ నివేదిక‌ను ఏ క‌నిక‌ట్టు ప్ర‌భావితం చేసింది?

posted on: Jun 20, 2022 3:11PM

అంతా మాయ‌గా వుంది. మొన్న తిట్టిపోసిన‌వారు అమాంతం మ‌హాద్భుతం అని  అదే నోటితో  ఎలా పొగుడుతారు? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధిక ప‌రిస్థితి దారుణంగా వుంద‌ని, జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్రా దివాళా దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని కేంద్ర ప‌రిధిలోని  కాగ్  తిట్టిపోసింది. కాగ్ మాట‌లు జ‌నం ఇంకా మ‌ర‌వ‌క‌ముందే  2021–22 కి సంబంధించి వెలువరించిన నివేదిక చాలా అనుకూల‌త ప్ర‌ద‌ర్శించింది. అప్పుల విషయంలో జగన్ సర్కారు పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కోవిడ్‌ సంక్షోభం వల్ల ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగిన ప్పటికీ బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట పరిమితులకు లోబడే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని  కాగ్‌ గణాంకాలు చెప్పాయని, ద్రవ్య లోటును తగ్గించే దిశగానూ వైసీపీ సర్కారు అడుగులు వేస్తోందని,  2021–22 ఆర్థిక ఏడాదిలో ఏపీ చేసిన అప్పులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువేనని కాగ్ రిపోర్టులో వెల్లడైంది. 
ద్ర‌వ్య లోటు లేన‌పుడు, ఆర్ధిక ప‌రిస్థితులు ఎంతో మెరుగ్గా వున్న‌పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేంద్రం ముందు అప్పుల కోసం సాగిల‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మేమి వచ్చింది. 
రాష్ట్రంలో వుద్యోగుల‌కు జీతాలు స‌మ‌యానికి ఇవ్వ‌లేక‌పోతున్న ప‌రిస్థితిని కాగ్ ఎలా విస్మ‌రిస్తుంది?  జీతాల విష‌యంలో కాస్తంత ఆలోచించి అడుగు వేయాల‌న్న ధోర‌ణితో వుద్యోగుల‌ను శాంత‌ప‌ర‌చ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం విశ్వ‌య‌త్నం చేసింది. అస‌లు రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాలు అద్భుతంగా సాగుతున్న పుడు ప్ర‌త్యేకించి అద‌నంగా అప్పులు తెచ్చుకోవ డానికి కేంద్రం చుట్టూ జ‌గ‌న్ ఎలా ప్ర‌ద‌క్షిణం చేస్తారు? 

మొన్న‌టివ‌ర‌కూ ప్ర‌తిప‌క్షం ఆర్ధికాంశంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. ప‌రిస్థితులు చేజారి పోతు న్నాయ‌ని హెచ్చ‌రించినా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. చేస్తున్న అప్పుల‌కు అభివృద్ది ప‌నులు బ్ర‌హ్మాండం గా సాగాలి క‌దా? అస‌లు గ‌త మూడేళ్లుగా చెప్పుకోద‌గ్గ అభివృద్ధి ప‌నంటూ ఏ ఒక్క‌టీ జ‌ర‌గ‌ని ద‌శ‌లో, అప్పుల వూబిలోకి జారుతోంద‌ని విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిక్కుతోచ‌క వుంది. ఇలాంటి స్థితి లో వున్నట్లు గ‌తంలోనే గుర్తించిన కాగ్ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ఇచ్చిన తాజా నివేదిక‌లో ఏపీ ని ఎంతో ప్ర‌శంసించింది. కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ ప్రకారం జ‌గ‌న్ ప్ర‌భుత్వం బడ్జెట్‌ అంచనాల్లో రూ.37,029.79 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొని, వాస్తవంగా రూ.25,194.62  కోట్లు మాత్రమే (68.04 శాతం) అప్పు చేసిం ది. అంటే ఇంకా 31.96 శాతం మేర అప్పు చేయ డానికి అవకాశం ఉన్నా చేయలేదని కథనంలో రాశారు. దీని వెనుక మ‌త‌ల‌బు ఏమిట‌న్న‌ది తేలాలి. 

టీడీపీ గత ఐదేళ్ల పాలనలో జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3% పరిమితికి మించి ఉండేదని, అలాంటి జగన్ హయాంలో ద్రవ్యలోటును గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2021–22లో 2.10 శాతానికి పరిమితం అయిందని, వైసీపీ ప్రభుత్వం విచక్షణ వల్లే ఇది సాధ్యమైందని కథనంలో రాశారు. వాస్తవాలు  ఇలా ఉంటే, అప్పుల విషయంలో ప్రతిపక్ష టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందని, ఆర్‌బీఐ ఆరా, కేంద్ర ప్రభు త్వం, బ్యాంకులు తాఖీదులంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

అస‌లు రాష్ట్ర ప‌రిస్థితి శ్రీ‌లంక ప‌రిస్థితిలా వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో, ప్ర‌జ‌లూ అదే సంగ‌తిని గ‌మ‌నిస్తున్నపుడు హ‌ఠా త్తుగా కాగ్  ఒక్క‌సారిగా వైసీపీ ప్రభుత్వం విచక్షణ వల్లే ఇది సాధ్యమైందని భ‌జ‌న‌కీర్త‌ల‌తో  నివేదిక‌ను నింపేయ‌డం ఎవ‌రి క‌లం ప్ర‌భావ‌మ‌న్న‌ది వెలుగులోకి రావ‌ల‌సి వుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...