అమ్మ ప్రేమకిదే తార్కాణం...చనిపోవాల్సిన వాడు లేచి కూర్చున్నాడు !

posted on: Jul 8, 2019 12:36PM

 

'అమ్మ..' అనేది నాకు తెలుగులో తెలిసిన తియ్యని పదం. ఆ పదం తెలియనివారు ఉండరు. అమ్మ గురించి రాయాలంటే ఎన్ని పేజీలైనా, ఎన్ని పుస్తకాలైనా సరిపోవు. అమ్మ గురించి చెప్పాలంటే మనం జీవితాంతం మాట్లాడినా సరిపోదు. అలాంటి అమ్మ గొప్పతనం మరో సారి బయట పడింది. మరి డాక్టర్ల చేతగానితనమో లేక ఆ అమ్మ పిలుపు మహత్యమో తెలియదు కానీ, అంత్యక్రియలకు రెడీ అయిన వ్యక్తి అమ్మ పిలుపు విని కోలుకుని మళ్ళీ బతికి బట్ట కట్టాడు. 

ఈ ఘటన ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనో చోటు చేసుకోలేది. విస్వనగరం హైదరాబాద్ కి కూత వేటు దూరంలో ఉండే సూర్యాపేటలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రికి చెందిన గంధం సైదమ్మకు ఇద్దరు కుమారులు. భర్త కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమారుడు సాయి డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కుమారుడు కిరణ్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 

జూన్ 26న కిరణ్‌కు వాంతులు, విరేచనాలు కావడంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. రెండ్రోజులు చికిత్స చేసినా తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు జూన్ 28న హైదరాబాద్ కామినేని వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం 29న వనస్థలిపురంలోని ఓ వైద్యశాలకు తీసుకెళ్ళారు. మూడురోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, బ్రెయిన్ డెడ్ అయ్యిందని, వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని చెప్పి ఈ నెల 3న డిశ్చార్జ్ చేశారు. 

దీంతో ఈ నెల 3న వెంటిలేటర్ తీసేసి ఖననం చేసేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌లో ఇంటికి చేరిన కిరణ్‌ కు వెంటిలేటర్ తొలగించినా ఊపిరాడుతూ గుండె కొట్టుకుంటుండడంతో అంత్యక్రియలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఈ నెల 4న ఖననం చేసేందుకు సిద్ధమవుతుండగా తల్లి సైదమ్మ ఏడుస్తూ కిరణ్...కిరణ్ అంటూ గట్టిగా పిలవడంతో అతడి కంట నుంచి నీరు కారింది. దీంతో హైదరాబాద్‌లోని వైద్యుల సూచనతో గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యం అందించగా కిరణ్‌లో కదలికలు వచ్చాయి.  ఇప్పుడు ఆ కుర్రాడు మంచం మీదనే ఉన్నా బతికి బట్ట కట్టాడు. సినిమాల్లో అంటుంటారు కదా ఇదో మెడికల్ మిరాకిల్ అంటూ అదేనేమో ఇది ? 

google-ad-img
    Related Sigment News
    • Loading...