పెళ్ళాం కాదు.. పిశాచి...

 

మగవాళ్ళని పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తిపాస్తులు సొంతం చేసుకునే క్రూరమైన ఆడవాళ్ళను ‘బ్లాక్ విడో’ అని పిలుస్తారు. చరిత్రలో ఇలాంటి బ్లాక్ విడోలు చాలామంది వున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఆడవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతూ వున్నారు. తాజాగా జపాన్‌కి చెందిన చిసాకో కకెహి అనే 67 సంవత్సరాల బామ్మ బ్లాక్ విడో అనే విషయం బయటపడింది. ఇప్పటి వరకు ఈమె ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఆరుగురిని పెళ్ళి చేసుకుంది. 2013 సంవత్సంలోనే తన ఆరో భర్తని చంపేసింది. ఇప్పుడు జీవితంలో తోడు పేరుతో మరో ముసలాయన్ని పెళ్ళి చేసుకునే ఆలోచనతో మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతోంది. ఈమె బ్లాక్ విడో అనే విషయం బయటపడి పోలీసులు దర్యాప్తు చేస్తే అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈమె తన భర్తకి సైనైడ్ ఇచ్చి చంపేసేది. భర్త ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా వారి పేరు మీద భారీ మొత్తాలకు ఎల్ఐసీ పాలసీలు చేసి ఆడబ్బు కూడా సొంతం చేసుకునేది. అలా ఆరుగురు భర్తలను చంపి ఇప్పటికి ఈమె దాదాపు 53 కోట్ల రూపాయలు సంపాదించింది. పోనీ, ఆ 53 కోట్ల ఆస్తిని ఈ ముసలమ్మ పోయిన తర్వాత సొంతం చేసుకోవడానికి వారసులెవరైనా వున్నారా అంటే అదీ లేదు. ఆరుగురు భర్తలని చంపేసింది. ఈమెకి వృద్ధాప్యం మీదపడింది. పైగా జైల్లో పడింది. వారసులు లేరు. మరి ఈమె ఇంత డబ్బు ఎందుకు సంపాదించినట్టు? ఈ ప్రశ్నకు సమాధానం ఆమె దగ్గర కూడా లేదేమో!