100 సార్లు స్నానం చేసినా దున్నపోతులానే ఉంటారు

 

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు హద్దు దాటి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామిని దున్నపోతుతో పోలుస్తూ రాష్ట్ర బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కగే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ ఇంటి నుంచి బయటకి వచ్చే ముందు ముఖానికి 10 సార్లు పౌడర్‌ రాసుకుంటారని, రోజులో 10 సార్లు దుస్తులు మారుస్తారని కుమారస్వామి అన్నారు. మోదీ ముఖంలోనే ఆ తేజస్సు ఉంది. కాని కుమారస్వామి 100 సార్లు స్నానం చేసినా దున్నపోతులానే ఉంటారు’ అని రాజు కగే వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీకి టీవీల్లో ప్రచారం బాగా లభిస్తుందంటూ కుమారస్వామి గతంలో అన్నారు. ‘మోదీ టీవీల్లో బాగా కనిపించాలని.. ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు 10 సార్లు పౌడర్‌ రాసుకుని వస్తారు. మేము సాధారణ మనుషులం. ఉదయం స్నానం చేసి బయటకి వస్తాం. మళ్లీ మరునాడు ఉదయం స్నానం చేస్తాం. ఈలోపు ఒకటి రెండు సార్లు ముఖం కడుక్కుంటాం. అందుకే మా ముఖాల్లో అంత తేజస్సు కనిపించదు. ఈ కారణంతోనే కొందరు పాత్రికేయులు మోదీని చూపించినట్లుగా మమ్మల్ని టీవీల్లో సరిగా చూపించడం లేదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజు కగే కుమారస్వామిని వ్యక్తిగతంగా విమర్శించారు. కాగా, రాజు కగే వ్యాఖ్యలపై  జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు.